సహజంగా రాజకీయాల్లో అధికార పక్షం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, అవి మంచివి అనా ప్రతిపక్షాలు ఏదో ఒక వంకతో వాటిని విమర్శిస్తుంటారు. ఇటీవల ఏపి సర్కార్ రహదారులపై సభలు, సమావేశాలను నిరోధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెం.1 తీసుకువచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో టీడీపీ సహా ఇతర రాజకీయ పక్షాలు అన్నీ తప్పుబట్టాయి. ఈ జీవోపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ జీవో చట్టవ్యతిరేకమనీ, ప్రత్యర్ధి పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు పెట్టుకుకోకుండా చేసే కుట్రలో భాగంగా తెచ్చాంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేయడంతో కోర్టు తాత్కాలికంగా ఆ జీవోను నిలుపుదల చేసింది. ఇప్పటికైనా ఆ జీవోను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. ఒకప్పుడు వైఎస్ జగన్ కు బద్ద విరోధిగా విమర్శలు ఎదుర్కొన్నరాజకీయ నాయకుడుగా మారిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాట్లాడటం ప్రతిపక్ష పార్టీలకు షాక్ ఇచ్చినట్లుగా అయ్యింది. జివో నెం.1 సరైనదేనని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన కొన్ని విషాద ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ జీవో ను అమలు చేయడం మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్లపై సభలు నిర్వహించే సమయంలో అనువైన స్థలాలను ఎంచుకునేందుకు పోలీసుల అనుమతి తప్పనిసరి చేయడం సమంజసమని లక్ష్మీనాారాయణ పేర్కొన్నారు. ఇలాంటి జీవోను స్వాగతించాల్సిందేనని దీన్ని తప్పుబట్టాల్సిన పని లేదన్నారు. ఈ జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందని చెప్పారు. ఒక వేళ ప్రతిపక్ష పార్టీల సభలకు అనుమతి ఇవ్వకుండా అధికార పార్టీకి అనుమతులు ఇస్తే కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుందని కూడా తెలిపారు.
ఇదే సందర్భంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటూ వస్తున్న వార్తలు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేస్తామన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపైనా వివి లక్ష్మీనాారాయణ స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. ఇటీవల ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేయడం సరైననది కాదని అన్నారు లక్ష్మీనారాయణ. చిన్న రాష్ట్రాల డిమాండ్ సమంజసం కాదని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లలో తాను దత్తత తీసుకున్న సహలాలపుట్టుగను తాజాగా ఆయన సందర్శించారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చూస్తుంటే తనకు ఆనందంగా ఉందని లక్ష్మీనాారాయణ అన్నారు. ఉద్దానం కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేపడుతున్నందుకు ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తున్నట్లు చెప్పారు. పద్మనాభపురం వద్ద నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఇక్కడి కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని, వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఇదే సందర్భంలో మంత్రి సీదిరి అప్పలరాజుకు ఫోన్ చేసి ప్రభుత్వ పని తీరును ప్రశంసించారు.
సీబీఐ నుండి స్వచ్చంద పదవీ విరమణ చేసిన వీవీ లక్ష్మీనారాయణ జనసేన ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ను అరెస్టు చేయడం, ఆ కేసు దర్యాప్తు చేసిన నేపథ్యంలో వీవీ లక్ష్మీనాారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆ సమయంలో వైఎస్ జగన్ అభిమానులు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు కూడా చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మీినారాయణ జనసేన తరుపున విశాఖ లోక్ సభ స్థానం నుండి పోటీ చేశారు. అయితే వ్యక్తిగత చరిష్మా కారణంగా ఆయనకు దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాదించారు. ఓటమి తర్వాత జనసేన నుండి బయటకు వచ్చారు. ఏ రాజకీయ పార్టీలో చేరకుండా స్వతంత్ర నేతగా సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగానే విశాఖలో పోటీ చేస్తానని ఆయన ఇటీవల ప్రకటించారు.
సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు ఇలా..