మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవేళ విచారణకు హజరు కాలేననీ, తమకు సమయం కావాలని ఆయన సీబీఐకి లేఖ రాశారు. సీబీఐ లేఖపై అవినాష్ రెడ్డి స్పందిస్తూ.. నిన్న నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణకు హజరుకావాలని పేర్కొన్నారన్నారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల ఇవేళ విచారణకు హజరు కావడం లేదని చెప్పారు. కనీసం రోజుకు రెండు మూడు వందల మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేసే కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నానని చెప్పారు. అందుకే నాలుగైదు రోజులు విచారణకు గడువు కోరాననీ, ఆ తర్వాత ఎప్పుడు విచారణకు నోటీసులు ఇచ్చినా వారి ముందు హజరై వారు అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం ఇస్తానని తెలిపారు.
గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబంపైనా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ కు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అవినాష్ రెడ్డి. కోర్టులో ట్రయిల్ మాత్రం ప్రారంభం కాలేదు కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం తనపైన, తన దగ్గరి వారిపైనా అసత్య ఆరోపణలు చేస్తూ వచ్చాయన్నారు. ఏనాడూ తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదన్నారు. ఈ సబ్జెక్ట్ పై మాట్లాడటానికి తన మనసు అంగీకరించడం లేదనీ, ఆ అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. తానేమిటో, తన వ్యక్తిత్వం ఏమిటో, తన వ్యవహారా శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసునని అన్నారు.
ప్రతి ఒక్కరినీ తాను మనవి చేసేది ఏమిటంటే న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలని దేవుడిని కోరుకోవాలని, తాను అదే కోరుకుంటున్నానన్నారు. మీడియా కూడా నిజం గెలవాలని కోరుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతే తప్ప కంక్లూజన్స్ డ్రా చేయవద్దని హితవు పలికారు. ఇటువంటి అభియోగాలు మోపి కారెక్టర్ అసాసినేషన్ చేస్తే దగ్గరి వాళ్లు ఎంత బాధపడతారో అర్ధం చేసుకోవాలన్నారు. మీకుటుంబాల్లో ఏమైనా జరిగితే మీకు ఆ బాధ తెలుస్తుందని మీడియాను ఉద్దేశించి అన్నారు. మీడియా బాధ్యతగా వ్యవహరించాలని నిజం గెలవడానికి కృషి చేయాలని కోరారు అవినాష్ రెడ్డి.
YS Viveka Murder Case: సీబీఐ విచారణకు సహకరిస్తా .. కానీ