MP RRR: వైసీపీ రెబల్, ఎంపీ రఘురామకృష్ణ రాజు రాజీనామా అంశం ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. తనపై అనర్హత వేటు వేయించేందుకు పిబ్రవరి 5వ తేదీ వరకూ వైసీపీ నేతలకు టైమ్ ఇచ్చిన రఘురామ.. వారు చేయలేకపోతే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని తెలిపిన విషయం తెలిసిందే. నరసాపురంలో తన గెలుపు ఖాయమనే ధీమా కూడా వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరావతి రాజధానిగా ప్రకటిస్తే.. జగన్ సీఎం అయ్యాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అనేక విషయాల్లో వైసీపీతో విబేధించిన రఘురామ అమరావతి ఏకైక రాజధాని అనే రిఫరెండంతో ఎన్నికలకు వెళ్తానని ప్రకటించారు. ఈక్రమంలో నరసాపురం ఉప ఎన్నికలో ఆయన గెలుపు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే..
రఘురామ నమ్మకం అదేనా..
జగన్ చరిష్మాతో 2019 ఎన్నికల్లో గెలిచారనే టాక్ ఉన్న రఘురామ.. అంత ధైర్యంగా రాజీనామా చేసి ఉపఎన్నికకు ఎలా వెళ్తున్నారనే ప్రశ్నలే అందరిలో మెదిలాయి. రఘురామ టీడీపీ, జనసేన, బీజేపీపై ఆశలు పెట్టుకున్నట్టే తెలుస్తోంది. ప్రజాబీష్టం పక్కనపెడితే.. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీల మద్దతు తనకే ఉంటుందని ఆయన ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో జగన్ హవా నడుస్తోందనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో జగన్ చరిష్మాతోనే నరసాపురం ఎంపీగా వైసీపీ నుంచి రఘురామ గెలిచారు. అయితే.. అక్కడ వైసీపీ కంటే.. టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి వచ్చిన ఓట్లు 2లక్షలకు పైగానే. ఇప్పుడీ లెక్కలపైనే ఆయన నమ్మకంగా ఉన్నారు.
జగన్ ఆలోచనలే వేరు..
ఏదొక పార్టీలో చేరి పోటీ చేసేకంటే.. ఇండిపెండెంట్ గా పోటీ చేసి మూడు పార్టీల మద్దతు తీసుకుని.. అందరి ఓట్లతో విజయం సాధించొచ్చనే స్ట్రాటజీలో రఘురామ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. బద్వేలు, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయాలు ఇక్కడ ప్రస్తావనార్హం. మునుపటి కంటే అత్యధిక మెజార్టీ సొంతమైంది. అక్కడ జగన్ వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. నరసాపురంలో కూడా జగన్ అంత సాదాసీదాగా రంగంలోకి దిగరు. జగన్ విషయం తెలిసీ రఘురామ అంత తేలిగ్గా సిద్ధమవరు. మరి.. రఘురామ బీజేపీ సహకారంతో కేంద్ర బలగాలను రప్పిస్తారా..? కేంద్రం నుంచి ప్రత్యేక అధికారులను తీసుకొస్తారా..? వేచి చూడాల్సిందే..!