BJP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరేందుకే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇవేళ కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారంయ. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో పార్టీకి ఉపయోగపడతారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే నల్లారి కిరణ్ కుమార్ సేవలను ఏపికి పరిమితం చేస్తారా.. తెలంగాణలోనూ ఎన్నికల సమయంలో వినియోగించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికపై ఏపి బీజేపీ నాయకులు ఎవరూ ఇంత వరకూ స్పందించలేదు. నేరుగా ఆయన పార్టీ కేంద్ర పెద్దల వద్ద పార్టీలో చేరుతున్నారు. ఆయనకు సముచిత గౌరవంతో పార్టీలో కీలక పదవి అప్పగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతున్న రీతిలో ఏపిలో మాత్రం అడుగులు పడటం లేదు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీలో చేరికలు జరిగాయి. ఆ తర్వాత సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆయన పార్టీలో జోష్ నింపలేకపోయారు. టీడీపీ, వైసీపీ నుండి భారీగా చేరికలు ఉంటాయంటూ గతంలో సోము వీర్రాజు ప్రకటనలు చేశారు. కానీ ఆ దిశగా చేరికలు మాత్రం జరగలేదు. దానికి తోడు పార్టీ గ్రూపు విభేదాలు తలెత్తాయి. సోము వీర్రాజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీలోని కొందరు నేతలు కేంద్ర కమిటీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి కి పార్టీ అధిష్టానం ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తుంది అనేది వేచి చూడాలి.
Breaking: బీజేపీ నేత బండి సంజయ్ కు ఊరట .. షరతులతో బెయిల్ మంజూరు