Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ ఈ కేసులో కీలక సూత్రధారి దేవిరెడ్డి శివశంకరరెడ్డి అని తేల్చింది. అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపిన తరువాత అనేక ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. అతని అరెస్టు తరువాత భరత్ కుమార్, గంగాదర్ రెడ్డిలు సీబీఐ దర్యాప్తుపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో పిర్యాదిదారులైన ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖరరెడ్డిలపై ఆరోపణలు చేస్తున్నారు. వీరి ఇద్దరి తరువాత వివేకా వద్ద దాదాపు 30 సంవత్సరాలు పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి కూడా ఇటీవల జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
Viveka Murder Case: వేరే వాళ్ల పేర్లు చెప్పాలని ఒత్తిడి
వేరే వారి పేర్లు చెప్పాలని తనపై ఒత్తడి చేస్తున్నారంటూ సీబీఐ పైనే కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేస్తున్న నేపథ్యంలో ఎస్పీ ఈ ఫిర్యాదుపై స్పందించలేదు. దీంతో నేడు కృష్ణారెడ్డి న్యాయవాదితో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. వివేకా కుమార్తె, అల్లుడు, సీబీఐ తనపై వేరే వాళ్ల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని అభియోగాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఒత్తిడి చేస్తున్న సిబీఐ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా సీబీఐ అరెస్టు చేసిన శివశంకరరెడ్డికి నార్కో పరీక్షలు చేయాలంటూ సిబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరో పక్క శివశంకరరెడ్డి అనారోగ్యానికి గురైయ్యాడంటూ ఆయనను జైలు నుండి ఆసుపత్రికి తరలించారు. ఇటీవల శివశంకరరెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కృష్ణారడ్డి పిటిషన్ పై కోర్టు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.