Parliament Monsoon Session 2021: కేంద్రంలోని బీజేపీపై వైసీపీ వైఖరి మారినట్లు కనబడుతోంది. నేటి నుండి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తమ వాణిని గట్టిగా వినిపించాలన్న కృత నిశ్చయంతో వైసీపీ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన సమస్యల పట్ల కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ఆ పార్టీ ఎంపిలు స్పష్టం చేస్తున్నారు. నిన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్రంపై ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు.
Read More: Vijaya Sai Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపి విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు..!!
గత రెండు సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ పట్ల వైసీపీ సానుకూల ధోరణితోనే వ్యవహరించింది. పలు కీలక బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యసభలో వైసీపీ సహకరిస్తూనే వచ్చింది. కేంద్రంతో సఖ్యతగా ఉన్నప్పటికీ పోలవరం నిధులు మంజూరు చేయడంలో. విభజన చట్టం హామీలను నెరవేర్చే విషయం తదితర అంశాలలో కేంద్రం పక్షపాత వైఖరి అవలంబిస్తుందనేది వైసీపీ వాదన. అదే విధంగా పార్టీ దిక్కారానికి పాల్పడుతున్న నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు అనర్హత పిటిషన్ పైనా స్పీకర్ 11 నెలలుగా చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. రెండు రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉభయ సభల్లో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
అయితే ఈ సారి సమావేశంలో ఎలాగైనా రఘురామపై అనర్హత వేటు వేసేలా పార్లమెంట్ సాక్షిగా ఆందోళన చేయాలని వైసీపీ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇటీవల విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలలోపు అనర్హత పిటిషన్ పై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్ లో ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించి ఉన్నారు. ఆ హెచ్చరికల తరువాతనే స్పీకర్ ఓం బిర్లా రఘురామతో పాటు మరో ఇద్దరు టీఎంసీ ఎంపిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తున్నది. ఉభయ సభల్లో ఈ సారి గతం కంటే భిన్నంగా వైసీపీ సభ్యులు గట్టిగానే వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి.