తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను కాపీ కొట్టాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ ఓ కీలక సూచన చేశారు. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ పై కామెంట్ సైతం చేశారు.
కేసీఆర్ సంచలన నిర్ణయం
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఇ.డబ్య్యు.ఎస్.లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇడబ్ల్యుఎస్ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పవన్ కీలక కామెంట్లు …
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చూపించిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈడబ్య్లూఎస్ 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల విద్యా, ఉపాధి అవకాశాలు మరింత మెరుగై ఆ వర్గాల్లో ఉపశమనం లభిస్తుందని ఆయన విశ్లేషించారు. “కాపు రిజర్వేషన్ కు మీరు ఎలాగూ వ్యతిరేకం కాబట్టి ఈ విధంగానైనా ఈడబ్య్లూఎస్ అమలు చేస్తే అగ్రవర్ణ పేదలకు కాస్త ఊరట లభిస్తుంది.“ అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ఎత్తిపొడిచే ప్రయత్నం చేశారు. కేసీఆర్ స్ఫూర్తితో జగన్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని కోరడమే కాకుండా కాపుల గురించి కామెంట్ చేయడంపై జగన్ టీం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సింది.