PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు (16వ తేదీ, మంగళవారం) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఆయన నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు మాదక ద్రవ్యాల కొత్త క్యాంపస్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ మరియు పరోక్ష పన్నులు 74 మరియు 75 వ బ్యాచ్ కి చెందిన ఆఫీసర్ ట్రైనీలతో పాటు భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో కూడా ప్రధాని మోడీ ఇంటరాక్ట్ అవుతారు.
సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అకాడమీ పరోక్ష పన్నులైన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ మరియు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రంగాలలో సమర్ధులైన సిబ్బందిని తీర్చిదిద్దుతుందని పీఎంఓ వివరించింది. క్యాంపస్ ప్రారంభించిన తర్వాత మోడీ .. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని కూడా మోడీ సందర్శించనున్నారు.
ఇప్పటికే భద్రతా దళాలు ప్రదాని మోడీ పర్యటించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సత్యసాయి జిల్లాకు రానున్నారు. అయనతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.