ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. వేలాది క్యూసెక్కుల వరద నీరు చేరుకుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 215 టీఎంసిలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 202 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టుకు 81,953 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండగా, 57,751 క్యూసెక్కులు ఓట్ ఫ్లో ఉంది.
కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తూ శ్రీశైలం జలాశయానికి నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఏపి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉదయం 11 గంటలకు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తిలకించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటున్నారు.
మరో వైపు ప్రాజెక్టు కుడి, ఎడమ వైపు ఉన్న ఏపి, తెలంగాణ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. విద్యుత్ ఉత్పత్తికి కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతి ఇవ్వడంతో 765 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్రతి ఏటా ఆగస్టు నెలలో విద్యుత్ ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చేది, కానీ ఈ సారి జులైలోనే భారీ వర్షాలు కురుస్తూ కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకుంటుండటంతో ముందుగానే విద్యుత్ ఉత్పత్తికి అనుమతిని మంజూరు చేసింది.