TDP : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. స్థానిక ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఓ పక్క ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవాలకు సిద్ధం కావాలనీ, గ్రామాభివృద్ధికి తోడ్పడాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవ పంచాయతీల ప్రోత్సాహకాలను భారీగా పెంచింది. జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుండి 20 లక్షల వరకూ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు నజరానా ప్రకటించింది ప్రభుత్వం. మెజార్టీ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా కృషి చేయాలంటూ మంత్రులు వైసీపీ నేతలను సూచించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రామాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు..పంచాయతీ ఎన్నికలను ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
గ్రామాల్లో యదేశ్చగా దోపిడీ చేయడం కోసమే వైసీపీ ఏకగ్రీవాల బాణీ ఎత్తుకుందని విమర్శించిన చంద్రబాబు.. జగన్ సీఎం అయిన తరువాత అధికార యంత్రాంగం నీరుగారిపోయిందని మండిపడ్డారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు అధికారులు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను చంద్రబాబు గుర్తు చేస్తూ ఈ సారి టీడీపీ కార్యకర్తలు, నాయకులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే అధారాలతో సహా ఫిర్యాదులు చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలకు బయపడే పార్టీ తెలుగుదేశం కాదనీ, సమర్థవంతంగా ఎన్నికలను ఫేస్ చేస్తుందన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందనీ, గ్రామాల్లో ఎక్కడా అభివృద్ధి పనులు అంటూ ఏమి జరగడం లేదనీ, ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించి పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ జరిగితే ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే వైసీపీ ఏకగ్రీవాలు అంటూ దౌర్జన్యాలు చేసే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులు అప్రమత్తతతో వ్యవహరించాలి అన్నారు.