Telugu cinema: తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకే ఏపిలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణలు చేశామని ఓ పక్క ఏపి ప్రభుత్వం చెబుతోంది. మరో పక్క ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై సినీ ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం ఓ స్పష్టమైన వైఖరితో ఉండటంతో సినిమా టికెట్ల వివాదం ఇప్పట్లో చల్లారేలా కనబడటం లేదు. జగన్ సర్కార్ తీసుకువచ్చిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణతో అదనపు షోలు రద్దు కావడంతో పాటు టికెట్ ధరలు తగ్గించనున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి దీనిపై స్పందిస్తూ టికెట్ల ధరలపై ప్రభుత్వం పునరాలోచించాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. తాజాగా టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానం, టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాగే ముందుకు సాగితే బీ, సీ సెంటర్ లో ధియేటర్ లకు కనీసం కరెంటు చార్జీలు కూడా వచ్చే అవకాశం లేదన్నారు.
Telugu cinema: పెద్ద సినిమాలు, ధియేటర్ల మనుగడ కష్టమే
ప్రస్తుత పరిస్థితుల్లో ధియేటర్ లకు ప్రజలు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారనీ, ఇలాంటి సమయంలో టికెట్ ధరలు తగ్గిస్తే నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవన్నారు. అసలు ధియేటర్ లలో సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి ఉండదని సురేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ లో వస్తువుని బట్టి ఒక్కో రేటు ఉంటుందని, అలాంటప్పుడు అన్ని వస్తువులను ఒకే రేటుకు అమ్మాలంటే ఎలా కుదురుతుందని సురేష్ బాబు ప్రశ్నించారు. పెద్ద సినిమా బడ్జెట్ వేరు, చిన్న సినిమాల బడ్జెట్ వేరు. రెండు సినిమాలకు ఒకే టికెట్ ధర నిర్ణయించడం సరైన నిర్ణయం కాదన్న అభిప్రాయాన్ని సురేష్ బాబు వ్యక్తం చేశారు. ఇలాగైతే భవిష్యత్తులో పెద్ద సినిమాలు భారీగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనా అంటే బ్లాక్ టికెట్ వ్యవస్థ అంటుంటారు. బ్లాక్ టికెటింగ్ ఉంటే రెండు మూడు రోజులు ఉంటుందేమో ఆ తరువాత టికెట్ మామూలు రేటుకే అమ్మాతారని అన్నారు. తిప్పికొడితే వెయ్యి కోట్ల పరిశ్రమ కాదిది దీనిపై ఇన్ని ఆంక్షలేమిటో అర్ధం కావడం లేదని అన్నారు. ప్రేక్షకులతో బలవంతంగా టికెట్ కొనిపించలేమనీ. ఇష్టమొచ్చిన వాళ్లే చూస్తారని, లేదంటే మానేస్తారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చిత్ర పరిశ్రమపై చిన్నచూపు చూస్తుండటం దారుణమన్నారు.