TDP Janasena: ఏపీ లో రాజకీయ పరిస్థితులు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పడం, ఇటీవల చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావడంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ -జనసేన కలిసే పోటీ చేస్తాయి అన్న టాక్ మొదలైంది. ఈ క్రమంలో టీడీపీ -జనసేన కు మధ్య సీట్ల పంపిణీ కి సంబందించి కూడా అనేక ఊహగానాలు వస్తున్నాయి. 2019 ఎన్నికల నాటి కంటే జనసేన బలపడి నందున 40 నుండి 45 స్థానాలు అడుగుతున్నదని, అయితే 25 నుండి 30 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఆయా పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో ఏ ఇద్దరు ముగ్గురు రాజకీయాలపై మాట్లాడుకుంటున్నా జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా..? సీట్ల పంపిణీ ఎలా ఉంటుంది.. ? ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది…? బీజేపీ ఏ స్టాండ్ తీసుకుంటుంది.. ? అనే అంశాలపైనే చర్చించుకుంటున్నారు.
అయితే జనసేన -టీడీపీ పొత్తులకు సంబందించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. ఒక విధంగా ఆ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టించినట్లుగా, జనసేనలో జోష్ నింపుతున్నట్లుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చాలా తెలివైన వ్యక్తి అని, తనని సీఎం అభ్యర్థి గా ప్రకటించకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని తాను అనుకోవడం లేదని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ కీలక ప్రతిపాదనకు టీడీపీ అంగీకరించక పొతే పవన్ కళ్యాణ్ కు పెద్దగా జరిగే నష్టం అయితే లేదు కానీ, టీడీపీకి మాత్రం మరో సారి భారీ నష్టం జరుగుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఈ సారి టీడీపీ అధికారంలోకి రాకపోతే జగన్ ఆ పార్టీని భూస్థాపితం చేస్తారని అన్నారు.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబే ఒక అడుగు వెనక్కు వేయక తప్పదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అయితే తన కుటుంబాన్ని అవమాన పర్చే రీతిలో అధికార వైసీపీ సభ్యులు సభలో మాట్లాడారని ఆరోపిస్తూ.. చంద్రబాబు గత ఏడాది మళ్ళీ ముఖ్య మంత్రి గానే అసెంబ్లీలోకి అడుగు పెడతానని లేకుంటే అసెంబ్లీకే రాను అంటూ శపధం చేసి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్లు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధిత్వాన్ని డిమాండ్ చేస్తే చంద్రబాబు రాజకీయ భవితవ్యం ఏమిటీ.. ఆయన చేసిన శపథం పక్కన పెడతారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పొత్తులకు సంబంధించి ఇప్పటి వరకూ చర్చలు జరగలేదని ఇదీ సమయం కూడా కాదని ఆయా పార్టీల నేతలు అంటున్నప్పటికీ రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తొంది. జనసేన – టీడీపీ కలిసే పోటీ చేస్తాయని, ముసుగు లొలగించారని వైసీపీ విమర్శిస్తూనే ఉంది.
ఈ పరిణామాలు చూస్తుంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనే వాళ్లు ఉన్నారు. మహారాష్ట్రలో శివసేన చీలికవర్గం నేత ఏక్ నాథ్ శిండే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగా, ఇష్టం లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ పార్టీ అధిష్టానం అదేశాలతో ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. ఇంతకు ముందు బీహార్ 78 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. కేవలం 45 స్థానాలు గెలుచుకున్న నితీష్ కుమార్ (జేడియు) కు సీఎం పదవిని కట్టబెట్టింది. ఆ తర్వాత నితీష్ కుమార్.. ఎన్ డీ ఏ నుండి వైతొలగి ఆర్ జేడీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీని రాష్ట్రంలో బతికించుకోవడం క్రోసం చంద్రబాబు ఆ త్యాగానికి సిద్దమవుతారా అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఒక వేళ చంద్రబాబు అటువంటి కీలక నిర్ణయం తీసుకుంటే తెలుగు తమ్ముళ్లు స్వాగతిస్తారా… ఆ పార్టీ నేతలు ఒప్పుంకుంటారా అనేది కూడా వేచి చూడాలి. కాగా పోగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్స్ మాత్రం టీడీపీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. మరో పక్క ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి వచ్చినా వైసీపీ, జగన్మోహనరెడ్డి అధికారాన్ని అడ్డుకోలేరని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.