Kesineni Nani: అందరూ ఊహించినట్లుగానే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి, చంద్రబాబు కి బిగ్ షాక్ ఇచ్చారు. తన రాజకీయ ప్రస్థానంపై కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తన లోక్ సభ సభ్యత్వంతో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. దీంతో విజయవాడ లో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఇవేళ తెల్లవారుజామున సోషల్ మీడియా వేదికగా మరో సారి స్పందించారు.
‘చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను’ అని ట్వీట్ చేశారు కేశినేని నాని.
తిరువూరు ఘటనపై పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం ఉదయం ఫేస్ బుక్ ద్వారా వెల్లడించిన కేశినేని నాని.. ఆ తర్వాత కేశినేని భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ పోస్టులో అన్ని వివరాలు సవివరంగా పెట్టానని.. అంతకు మించి చెప్పేది ఏమీ లేదంటూనే టీడీపీలో ప్రకంపనలు రేపే విషయాలను నింపాదిగా చెప్పారు. మీడియాకు కావాల్సింది మసాలానే కదా..తినబోతు రుచులెందుకు అని ప్రశ్నించారు. అన్ని విషయాలు ఒకే రోజు ఎందుకు..ఈ రోజు విషయం రేపటికి కరెక్టు కాకపోవచ్చు. రేపటి విషయం ఎల్లుండి కరెక్ట్ కాకపోవచ్చు..అది ఎవరికి ఎలా అర్ధమయితే ఆలా ఇచ్చుకోండి అని మీడియాకే వదిలివేశారు.
ఇదే క్రమంలో మీడియాపైనా వ్యాఖ్యలు చేశారు. మీడియాను తాను పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని అన్నారు. రేవంత్ రెడ్డి దొంగ అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఏదేదో ప్రచారం చేసింది..ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అయి కూర్చున్నాడు.. మీడియా ఏం పీకగలిగింది అంటూ సంచలన కామెంట్స్ చేసారు. 2024 మే వరకూ తాను విజయవాడ ఎంపీని, తన రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. గొడవలు పడటం తన నైజం కాదనీ, అంత మాత్రాన అది చేతకానితనం కాదని అన్నారు. తిరువూరు సభ గొడవ లేకుండా జరగాలని దూరంగా ఉండాలని అనుకున్నట్లుగా చెప్పారు. లోకేష్ యువగళం పాదయాత్ర విజయవాడలో ప్రశాంతంగా సాగాలనే తాను దూరంగా ఉన్నట్లు తెలిపారు.
మూడో సారి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తాననీ, ఢిల్లీ వెళ్లడం అనేది ఖాయమని నాని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి కాదా.. ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోతే ప్రైవేటు జెట్ లో వెళ్లాలి కదా అంటూ కామెంట్స్ చేశారు. స్వతంత్ర అభ్యర్ధిగానైనా పోటీ చేయడం ఖాయం, గెలవడం ఖాయమనే సంకేతాన్ని ఇచ్చారు కేశినేని నాని. తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదనీ, పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినని అన్నారు. తనను వద్దని చంద్రబాబు అనుకున్నారు కానీ తాను అనుకోలేదని వ్యాఖ్యానించారు.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తాను మంచి స్నేహితులం అయినా అక్కడి కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో తాము కలిసి పని చేయలేదు కదా అని కామెంట్స్ చేశారు. తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. తాను ఏమి చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్నారు. పదేళ్లుగా విజయవాడకు ఎంతో అభివృద్ధి చేశాననీ అటువంటి తాను ఖాళీగా ఉంటే అభిమానులు, కార్యకర్తలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే తన అభిమానులతో త్వరలో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యచరణ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తుండగా, ఒక్క రోజు వ్యవధిలోనే తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు కేశినేని నాని. కేశినేని ట్వీట్ లో తాను బయటకు వెళుతున్నట్లు అర్ధం వచ్చేలా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో కేశినేని నాని ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎగ్జిట్ ద్వారం వద్ద దిగిన ఫోటోను షేర్ చేశారు.
YS Sharmila: కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల .. ఏపీలో ఏ పార్టీకి ప్లస్..? ఏ పార్టీకి మైనస్ ..?
చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన
కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG— Kesineni Nani (@kesineni_nani) January 5, 2024