Kesineni Nani: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలనుందా..? విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ లేదా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తొంది. రాబోయే ఎన్నికల్లో విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్ ప్రస్తుత ఎంపీ కేశినేని నానికి కాకుండా వేరే వ్యక్తికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా కేశినేని చిన్ని (శివనాథ్) కు టీడీపీ అభ్యర్ధిత్వం ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.
విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని స్వయంగా కేశినేని నాని ఇవేళ ఉదయం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తిరువూరు లో జరిగే పార్టీ అధినేత చంద్రబాబు కార్యక్రమంలో కలుగజేసుకోవద్దని చంద్రబాబు మాటగా పార్టీ నేతలు తనకు చెప్పారని, అదే విధంగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు. అధినేత నిర్ణయాన్ని శిరసావహిస్తానని పేర్కొన్న కేశినేని నాని..ఆ తర్వాత కేశినేని భవన్ లో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను పరోక్షంగా చెప్పేశారు. మీడియాకు మషాలా అందించారు.
ఫేస్ బుక్ పోస్టులో అన్ని వివరాలు సవివరంగా పెట్టానని.. అంతకు మించి చెప్పేది ఏమీ లేదంటూనే టీడీపీలో ప్రకంపనలు రేపే విషయాలను నింపాదిగా చెప్పారు. మీడియాకు కావాల్సింది మసాలానే కదా..తినబోతు రుచులెందుకు అని ప్రశ్నించారు. అన్ని విషయాలు ఒకే రోజు ఎందుకు..ఈ రోజు విషయం రేపటికి కరెక్టు కాకపోవచ్చు. రేపటి విషయం ఎల్లుండి కరెక్ట్ కాకపోవచ్చు..అది ఎవరికి ఎలా అర్ధమయితే ఆలా ఇచ్చుకోండి అని మీడియాకే వదిలివేశారు. ఇదే క్రమంలో మీడియాపైనా వ్యాఖ్యలు చేశారు. మీడియాను తాను పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని అన్నారు.
రేవంత్ రెడ్డి దొంగ అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఏదేదో ప్రచారం చేసింది..ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అయి కూర్చున్నాడు.. మీడియా ఏం పీకగలిగింది అంటూ సంచలన కామెంట్స్ చేసారు. 2024 మే వరకూ తాను విజయవాడ ఎంపీని, తన రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. గొడవలు పడటం తన నైజం కాదనీ, అంత మాత్రాన అది చేతకానితనం కాదని అన్నారు. తిరువూరు సభ గొడవ లేకుండా జరగాలని దూరంగా ఉండాలని అనుకున్నట్లుగా చెప్పారు. లోకేష్ యువగళం పాదయాత్ర విజయవాడలో ప్రశాంతంగా సాగాలనే తాను దూరంగా ఉన్నట్లు తెలిపారు.
మూడో సారి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తాననీ, ఢిల్లీ వెళ్లడం అనేది ఖాయమని నాని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి కాదా.. ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోతే ప్రైవేటు జెట్ లో వెళ్లాలి కదా అంటూ కామెంట్స్ చేశారు. అంటే వైసీపీ, బీజేపీ లేదా మరే ఇతర పార్టీ లో టికెట్ లభించకపోతే స్వతంత్ర అభ్యర్ధిగానైనా పోటీ చేయడం ఖాయం, గెలవడం ఖాయమనే సంకేతాన్ని ఇచ్చారు కేశినేని నాని. తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదనీ, పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినని అన్నారు. తనను వద్దని చంద్రబాబు అనుకున్నారు కానీ తాను అనుకోలేదని వ్యాఖ్యానించారు. తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. తాను ఏమి చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్నారు.
పదేళ్లుగా విజయవాడకు ఎంతో అభివృద్ధి చేశాననీ అటువంటి తాను ఖాళీగా ఉంటే అభిమానులు, కార్యకర్తలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే తన అభిమానులతో త్వరలో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యచరణ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ అయితే విజయవాడ వైసీపీకి ఇంత వరకూ ఇన్ చార్జి ఎవరూ లేరు..పార్లమెంట్ అభ్యర్ధి కోసం అన్వేషనలో వైసీపీ ఉంది. ఈ తరుణంలో క్లీన్ ఇమేజ్, వ్యక్తిగత ఓటింగ్ కల్గి ఉన్న కేశినేని నానికి వైసీపీ రెడ్ కార్పెట్ స్వాగతం పలికే అవకాశం లేకపోలేదన్న వాదన వినబడుతోంది. చూడాలి ఏమి జరుగుతుందో..!
ED: మాజీ ప్రజాప్రతినిధి నివాసంలో నోట్ల కట్టలు..తుపాకులు