ఏపిలో దేవాలయాపై జరుగుతున్న దాడులు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండ రాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే తాజాగా కడప జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇంతకు ముందు ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తుండగా ఇప్పుడు ఏకంగా ఆలయంలో విగ్రహాన్నే మాయం చేశారు.
కడప జిల్లా వేముల మండలం చాగరేవు గ్రామంలో వినాయక విగ్రహాన్ని గురువారం రాత్రి దుండగులు అపహరించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికలు సమాచారంతో ఎస్ఐ సంజీవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇప్పటికే విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై బీజెపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. దేవాలయాలపై ఘటనలను పురస్కరించుకుని ప్రభుత్వంపై బీజెపీ, హిందూ సంఘాలు, టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా ప్రభుత్వం కూడా ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నది. ఆలయాలపై దాడుల వ్యవహరంలో కుట్ర కోణం దాగి ఉందని ఇప్పటికే ప్రభుత్వం, పోలీసు యంత్రాగం ప్రాధమిక అంచనాకు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దీనిపై సీరియస్ తీసుకున్నారు. రాష్ట్రంలో మత విధ్వేషాలను రెచ్చగొట్టే కుట్రలో భాగంగా ఇవి చేస్తున్నారనేది ప్రభుత్వం భావిస్తున్నది. దేశ వ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో రాష్ట్రం దూసుకువెళుతున్న క్రమంలో మతకల్లోలాలను సృష్టించడం ద్వారా శాంతి భద్రతలను దెబ్బతీసి అభివృద్ధిని నిరోధించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులు, వివిధ మతాలకు చెందిన ప్రతినిధులతో మతసామరస్య కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.