Vijayasai Reddy Vs Purandeswari: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులైన తర్వాత వైసీపీ సర్కార్ పై వివిధ అంశాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఏపీ సర్కార్ చేస్తున్న అప్పులు, మద్యం అమ్మకాలు తదితర అంశాలపై ఆరోపణలు చేశారు. నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో పురందేశ్వరిని వైసీపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది. టీడీపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి వ్యవహరిస్తొందనీ, బీజేపీ లో ఉంటూ చంద్రబాబు కోసం పని చేస్తొందంటూ విమర్శలు గుప్పించారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించగా, విజయసాయి రెడ్డి పై ఆమె సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాశారు. సీబీఐ కేసుల్లో ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని పంపారు. విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న సీబీఐ/ఇడీ కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ చేయించాలని సీజేను అభ్యర్ధిస్తూ లేఖ పంపారు.
దీంతో విజయసాయి రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మరింత ఘాటుగా విమర్శలు చేశారు. నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉందని ఘాటుగా కామెంట్స్ చేశారు విజయసాయి రెడ్డి. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా అంటూ విమర్శించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా పురందేశ్వరి మారిందని దుయ్యబట్టారు. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారని అన్నారు.
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులేననీ, ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురందేశ్వరిదని అన్నారు విజయసాయి రెడ్డి. సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబు ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు అని వ్యాఖ్యానించారు. “అన్న టీడీపీ” అనే పార్టీని పురందేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించి, తనే కొబ్బరికాయ కొట్టి, కొంత కాలం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసి, ఆ పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్ లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు ఈవిడ అని ఎద్దేవా చేశారు.
పురందేశ్వరి లక్ష్యంగా వైసీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆమె పదవికి చేటు వాటిల్లుతుందన్న టాక్ నడుస్తొంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు వైసీపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కారణంగా పురందేశ్వరి పదవికి ఎసరు వచ్చే ప్రమాదం పొంచి ఉందని అనుకుంటున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కేసిఆర్ సర్కార్ పై దూకుడు వ్యవహరించిన బండి సంజయ్ ను పార్టీ అధిష్టానం అకస్మాత్తుగా మార్పు చేసి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పురందేశ్వరికి ఆ పరిస్థితి వస్తుందేమో అని భావిస్తున్నారు. ఇప్పటికే పురందేశ్వరి తీరు పై బీజేపీ నాయకత్వానికి వైసీపీ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తొంది, చూడాలి ఏమి జరుగుతందో..!