KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారా? నొప్పింపక .. తానొవ్వక అన్నట్లుగా సున్నితంగా డీల్ చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావారణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఏపీ అంబులెన్లను సరిహద్దు చెక్ పోస్టు వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో ఆంధ్రావాసులు ఆందోళనకు దిగారు. తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను ఆపివేయడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ నమ్మినబంటు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.
సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?
ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్లను సరిహద్దులో తెలంగాణ పోలీసులు ఆపేస్తున్నారు. ఆసుపత్రి అనుమతి, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఈ-పాస్ ఉంటేనే పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్కారుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అదే సమయంలో హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉదంతంపై ఏపీ ప్రభుత్వం తాజాగా అధికారికంగా స్పందించింది.
జగన్ మనిషి ఏమంటున్నారంటే…
అంబులెన్స్ ను ఆపడం దురదృష్టకరమని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రజల గురించి ఆలోచించడం సహజమే కానీ పొరుగు రాష్ట్రం వారి గురించి సైతం ఆలోచించాలన్నారు. హైకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్ లైన్స్ పెట్టింది. ఆ గైడ్ లైన్స్ ను పాటించడం కష్టం అని అన్నారు. ఏపీ ప్రజలు బెంగళూరు, చెన్నై నగరాలకు వైద్యం కోసం వెళ్తున్నారని, కానీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్న సజ్జల తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుందని, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో రాష్ట్రంలో మౌళిక వసతులు అభివృద్ధి చేయలేదని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ లో వైద్యసదుపాయాలు తక్కువే అని అన్నారు.