YS Jagan: దేశంలో కరోనా కలకలం కొనసాగుతుండగా కొన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 41,871 శాంపిల్స్ పరీక్షించగా 10,759 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 24 గంటల్లోనే కోవిడ్తో 29 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. అయితే, ఇలాంటి సమయంలో ప్రభుత్వం తరఫున ఓ గుడ్ న్యూస్ వినిపించింది.
ఆక్సిజన్ సమస్య లేదు…
కరోనా చికిత్సలో కీలకమైన ఆక్సిజన్ సరఫర విషయంలో అంతటా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ అందుబాటు, సరఫరా జరుగుతున్న తీరుపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఆక్సిజన్ కు లోటు లేదని అన్నారు. ఏపీలో 40 రకాల పరిశ్రమల ద్వారా 510 ఎం.టీ మెడికల్ ఆక్సిజన్ తయారీ చేస్తున్నామని వెల్లడించారు. ఆక్సిజన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అవసరాల తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని పేర్కొన్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆక్సిజన్ సరఫరా జరుగుతున్న తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను సన్నద్దం చేశామని తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలో కేసుల పరిస్థితి ఇది…
ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 997462కు చేరగా.. యాక్టివ్ కేసులు 66944గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 922977 కరోనా నుంచి కోలుకోగా 7541 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ బారిన పడి చిత్తూర్ లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, కర్నూల్ లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, ప్రకాశం లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు, అనంతపురం , వైఎస్ఆర్ కడప మరియు విశాఖపట్నం లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.. ఇదే సమయంలో 3,992 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
కీలక నిర్ణయం
ఇది ఇలా ఉండగా కరోనా కట్టడిలో భాగంగా 104 కాల్ సెంటర్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మంగళగిరిలో ఏపీఐఐసీ భవనంలో 50 మందితో ప్రభుత్వం కాల్ సెంటర్ ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఏ సమస్య వచ్చినా సలహాలు, సూచనలు పొందేందుకు 104కి కాల్ చేసే విధంగా ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.