Chandrababu – YS Sharmila: కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్ధం జనవరి 18, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు షర్మిల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి స్వయంగా షర్మిల తన కుమారుడి పెళ్లి శుభలేఖ అందజేసి ఆహ్వానిస్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి షర్మిల చేరుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను తన కుమారుడి వివాహ మహోత్సవానికి ఆహ్వానించారు. ఏపీ, తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలను షర్మిల ఈ క్రమంలో కలుస్తున్నారు. ఇందులో రాజకీయ ప్రాధాన్యత లేకపోయినప్పటికీ ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
చంద్రబాబుకు వివాహ ఆహ్వానం ఇచ్చిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. ఇంతకు ముందు క్రిస్మస్ కేక్ పంపితే కూడా రాజకీయం చేశారని, తాను అటు బీఆర్ఎస్ పార్టీ కేటిఆర్, కవిత లాంటి వారికి కూడా క్రిస్మస్ కేక్ పంపడం జరిగిందన్నారు. తన కుమారుడి వివాహానికి అన్ని రాజకీయ పక్షాల నేతలను ఆహ్వానిస్తున్నానని, ఆదే క్రమంలో చంద్రబాబు నివాసానికి రావడం జరిగిందన్నారు.
ఈ సందర్భంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని షర్మిల చెప్పారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి తో చంద్రబాబు మంచి స్నేహం ఉండేదని, అన్నారు. రాజకీయంగా ప్రత్యర్ధులు అయినా వ్యక్తిగత సంబంధాలు ఎవరికైనా ఉంటాయని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ తనకు ఏ పదవి ఇచ్చినా స్వీకరించడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఏ బాధ్యత ఇచ్చినా తన వంతుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.