YSR Kapu Nestam Scheme: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు రెండవ విడత కాపునేస్తం నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద మహిళలకు రూ.15 వేల వంతున సాయం అందిస్తోంది. గురువారం కాపు నేస్తం రెండవ విడతలో భాగంగా 3,27, 244 మందికి రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి వారి బ్యాంకు అకౌంట్ లలో జమ చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో వైఎస్ఆర్ కాపు నేస్తం అందిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15వేల ఆర్థిక సహాయం, అయిదేళ్లలో మొత్తం రూ.75వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కు తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరిస్తూ పారదర్శకంగా ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా గత సంవత్సరం 3,27,349 మంది లబ్దిదారుల ఖాతాల్లో 491.02 కోట్లు జమ చేయగా నేడు 3,27,244 మంది పేద కాపు మహిళలకు అందించిన రూ.490.86 కోట్లతో కలిసి మొత్తం రూ.981.88 కోట్లు అందించినట్లు అయ్యిందన్నారు.