ఎన్నికల్లో సీట్లు కావాలంటే జనంలో ఉండాల్సిందేనని మరో సారి స్పష్టం చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిలతో బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణ తీరుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించని ఎమ్మెల్యేలకు సున్నితంగా క్లాస్ పీకినట్లు సమాచారం. ఎన్నికల వరకూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందేనని జగన్ సూచించారు. సమావేశం ముగిసిన తర్వాత వివరాలను మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.
2024 ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు కృషి చేయాలని జగన్ దిశా నిర్దేశం చేశారని పేర్ని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 27 మంది పని తీరు బాాగా లేదనీ జగన్ పేర్కొన్నారనీ, వీరు వచ్చే సమావేశం నాటికి తమ పని తీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారన్నారు. సమావేశంలో వారి పేర్లు మాత్రం వెల్లడించలేదనీ, పేర్లు వెల్లడిస్తే వారిని తక్కువ చేసినట్లు అవుతుందన్న కారణంగా జగన్ పని తీరు బాగాలేని నేతల పేర్లు వెల్లడించలేదని తెలిపారు.నవంబర్ నెలలో మరో సారి గడపగడపకుపై సమావేశం ఏర్పాటు చేస్తామనీ, అప్పటి లోగా పని తీరు బాగోలేని వారు పని తీరు మెరుగుపర్చుకోవాలని జగన్ సూచించారన్నారు.
ఎవరి పనితీరు బాగా లేదో వారికే ఈ విషయం బాగా తెలుసునని జగన్ అన్నారన్నారు. పని తీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించనున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయాన్ని జగన్ మరో సారి గుర్తు చేశారని పేర్ని తెలిపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటానని జగన్ చెప్పారని వెల్లడించారు. ఎన్నికల నాటికి పని తీరు మెరుగుపర్చుకోని వారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారన్నారు. రాజకీయాలను పార్ట్ టైమ్ గా తీసుకునే వారికి అవకాశాలు ఇవ్వలేమని కూడా జగన్ చెప్పారన్నారు పేర్ని నాని.
రాంకో సిమెంట్స్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్