కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాపు ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో తమ సామాజిక వర్గానికి చెందిన యువకులపై పెట్టిన కేసులను వైసీపీ సర్కార్ ఉప సంహరించడం, రైల్వే కోర్టు కూడా ఆ కేసును కొట్టివేయడంతో ముద్రగడ పద్మనాభం మరల క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్నారుట. వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాడు లేదా పిఠాపురం నుండి పోటీ చేయాలన్న ఆసక్తి చూపుతున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఒక వేళ తను పోటీ చేయకపోతే తన కుమారుడిని వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు నేతలు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వైసీపీ ఎంపీ వంగా గీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో పాటు పలువురు ఎంపీపీలు, కాపు నేతలు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి సమావేశమైయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తొంది. చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ పద్మనాభం నుండి వైసీపీలోకి ఆహ్వానించేందుకే వీరు వెళ్లినట్లుగా, అది కూడా సీఎం జగన్మోహనరెడ్డి సూచనల మేరకే వెళ్లారనే అనుకుంటున్నారు. ముద్రగడ ఆలోచనలు, పార్టీలో చేరేందుకు ఆయన కోరికలను తెలుసుకుని సీఎం జగన్మోహనరెడ్డి కి తెలియజేయడం ద్వారా పార్టీలో చేరికకు మార్గం సుగమం చేసే ప్రయత్నంలో భాగంగా వైసీపీలోని కాపు సామాజికవర్గ నేతలు ముద్రగడతో భేటీ అయ్యారన్న చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ సీటు హామీ లభిస్తే త్వరలో వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నారు. ప్రధానంగా ఈ నెల 14వ తేదీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ను దెబ్బకొట్టేందుకు ముద్రగడను అస్త్రంగా వాడుకోవాలని వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తొందనేది టాక్. ఈ క్రమంలోనే వైసీపీ కాపు నేతల భేటీ అన్న చర్చ జరుగుతోంది. వీరి సమావేశ ఎజెండా ఏమిటి అనేది బయటకు అయితే రాలేదు కానీ త్వరలో ముద్రగడ వైసీపీలోకి ఎంట్రీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
దివ్యాంగులకు సీఎం కేసిఆర్ గుడ్ న్యూస్