YSRCP MLA MS Babu: టికెట్ నిరాకరించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. నా బీసీ..నా ఎస్సీ..నా ఎస్టీ అంటున్న సీఎం జగన్ దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళిత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అయిదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేలను ఒక్క రోజు అయినా చేరదీసి జగన్ తమ మంచి చెడుల గురించి మాట్లాడిన పాపాన పోలేదని అన్నారు. తనపై వ్యతిరేకత ఉందని సీటు ఇవ్వనని చెబితే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు.
తాను జగన్ చెప్పిన పనులు అన్నీ చేశానని అన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. మంత్రులు, పార్టీ పెద్దలు, జగన్ చెప్పిన పనులు అన్నీ చేసినప్పుడు అసంతృప్తి ఉంటే అది తమ వల్ల ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. తాను ఏం తప్పు చేశానో జగన్ పిలిచి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాను జగన్ ను కలిసినప్పుడు వ్యతిరేకత ఉందని తనతో అన్నారని ఎంఎస్ బాబు మీడియాకు తెలిపారు. తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లే తాను గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగానని అన్నారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఓసీలను మార్చలేదని, కేవలం దళితుల పట్లనే అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే వారికి అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఐ ప్యాక్ సర్వేలో పనితీరు సరిగా లేదంటూ ఎక్కువగా దళిత నియోజకవర్గాల్లోనే మార్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఐప్యాక్ సర్వేల ద్వారానే టికెట్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. పార్టీ కోసం కుటుంబాన్ని, వ్యాపారాన్ని అన్ని వదులుకొని అయిదేళ్లు పార్టీ, ప్రజా సేవలో లీనమైపోయానని చెప్పారు.
తాను అవినీతికి పాల్పడి భూకబ్జాలతో చెడ్డపేరు తెచ్చుకున్నారని అంటున్నారని, తాను ఏ అవినీతికి పాల్పడలేదని కాణిపాకంలో ప్రమాణం చేయడానికి కూడా సిద్దమని ఎంఎస్ బాబు అన్నారు. డబ్బులు ఇస్తే ఐప్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారని అన్నారు. ఇప్పటికీ వైసీపీపై తనకు నమ్మకం ఉందన్నారు. పార్టీని వీడేది లేదనీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గౌరవం ఉందని, ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పేర్కొన్నారు.
YS Sharmila: చేరికకు వేళాయె .. ఇడుపులపాయ నుండి నేడే కీలక ప్రకటన..?