YSRCP: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలను మార్చిన సీఎం వైఎస్ జగన్ .. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల మార్పునకు కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రోజుకు కొంత మంది నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. ఇన్ చార్జిల మార్పు ప్రక్రియ ఆ పార్టీ నేతలకు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తొంది. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ వీడగా, తాజా మరో ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశారు. మరి కొందరు ఆదే బాటలో పయనమవ్వడానికి సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన మాజీ నేతలు పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మొదలైన రాజీనామాల పర్వం ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, సీ రామచంద్రయ్య, తాజాగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వరకూ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో టికెట్ లేదని చెప్పడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఓ కార్యాలయం వద్దనే పార్టీపై జగన్ పై అక్కసును వెళ్లగక్కారు. వైఎస్ఆర్ కుటుంబానికి తీవ్ర అభిమానినైన తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ సీపీలో చేరినట్లు చెప్పారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా పార్టీ కోసం రేయింబవళ్లు కష్టపడ్డానని చెప్పుకొచ్చారు.
ఇన్నేళ్లూ జగన్ ఏం చేబితే అదే చేశామనీ, ఇప్పుడు సర్వే రిపోర్టు పేరు చెప్పి టికెట్ ఇవ్వలేమని చెప్పడం చాలా బాధ కల్గించిందని అన్నారు. ఇంతకన్నా అవమానం మరోటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని నమ్మించి గొంతుకోశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచే సత్తా తమకు ఉందనీ, రాబోయే ఎన్నికల్లో వేరే పార్టీ నుండి గానీ స్వతంత్ర అభ్యర్ధులుగా అయినా పోటీ చేస్తామని చెప్పారు. కళ్యాణదుర్గంలో తాను, రాయదుర్గంలో తమ సతీమణి పోటీ చేస్తామని ప్రకటించారు.
కాగా మంత్రి గుమ్మనూరు జయరాం, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలను సీఎంఓకు పిలిపించి పార్టీ ముఖ్యనేతలు చర్చించారు. గిద్దలూరు ఇన్ చార్జి మార్పుతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే అన్నా రాంబాబును సీఎం బుజ్జగించినట్లు తెలుస్తొంది. అన్నా రాంబాబుకు నరసరావుపేట సీటు ఇస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం.
దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను వేరే నియోజకవర్గానికి వెళ్లాలని సూచించినట్లుగా సమాచారం. టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఏమి చేయాలని ఆలోచిస్తానని మద్దిశెట్టి అన్నట్లు తెలుస్తొంది. మరో వారం రోజుల్లో వైసీపీ మూడో జాబితా విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ అధినేత జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారని, సహకరించాలని పార్టీ అధిష్టానం అసంతృప్తి నేతలకు విజ్ఞప్తి చేస్తొంది.
కీలక నాయకులను బుజ్జగించి మరల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ, లేదా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు. కొందరు మెత్తబడుతుండగా, మరి కొందరు మాత్రం తమ రాజకీయ భవిష్యత్తు కోసం సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామాల అడ్డుకట్టకు పార్టీ అధిష్టానం ఏ విధంగా చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.
Kesineni Nani: కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని .. బాబుకు బిగ్ ఝలక్