YSRCP: ఇద్దరు అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఒకరిపై మరొకరు సీబీఐకి ఫిర్యాదులు చేసుకోవడం ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఆ పార్టీ నేతల పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు గతంలోనే స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేసినా ఇంత వరకూ ఆయనపై చర్యలు తీసుకోలేదు. రఘురామకృష్ణం రాజు నిత్యం ప్రభుత్వ విధానాలను, సీఎం జగన్మోహనరెడ్డి చర్యలను విమర్శిస్తూనే ఉన్నారు.
Read More: MP Vijaya Sai: సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ కు ఎంపి రఘురామపై ఫిర్యాదు..! మేటర్ ఏమిటంటే..?
YSRCP: రఘురామ కృష్ణంరాజుపై విజయసాయిరెడ్డి సీబీఐకి లేఖ
ఈ నేపథ్యంలో రీసెంట్ గా రఘురామ కృష్ణంరాజుపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీబీఐకి లేఖ రాశారు. రఘురామ కృష్ణంరాజుకు చెందిన ఇండ్ భారత్ పవర్ ఇన్ ఫ్రా లిమిటెడ్ లో జరిగిన అక్రమాలపై త్వరితగతిన విచారణ చేపట్టాలని సీబీఐ డైరెక్టర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ కు ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్ గా రఘురామకృష్ణం రాజు కూడా విజయసాయి రెడ్డిపై సీబీఐ డైరెక్టర్ కు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు విషయంపై ఫిర్యాదు చేస్తూ ఈ కేసులో విజయసాయిరెడ్డిని విచారించాలని కోరారు.
YSRCP: విజయసాయిరెడ్డిని విచారించాలి
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐ డైరెక్టర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ కు లేఖ రాశారు రఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కేసులోని నిందితుల తరహాలోనే ఈ కేసులోనూ నిందితుల్ని అంతమొందించే కుట్ర జరుగుతోందని రఘురామ తన లేఖలో అనుమానాలు వ్యక్తం చేశారు. జైలులో, జైలు బయట ఉన్న నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని సీబీఐ డైరెక్టర్ ను కోరారు. ఈ కేసులో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విచారించాలని రఘురామ సీబీఐకి రాసిన లేఖలో కోరారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ లావాదేవీలు జరిగినట్లు చెప్పడంతో పాటు పలువురు ప్రముఖుల పేర్లు కూడా వెల్లడించారని కావున వారికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఒకరిపై మరొకరు సీబీఐకి ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.