YSRCP : ఏపిలో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల మేయర్, డిప్యూటి మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక ఈ నెల 18వ తేదీ (గురువారం) జరుగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీలు తాడిపత్రి, మైదుకూరు మినహ 11 కార్పోరేషన్ లు, 73 మున్సిపాలిటీలలో వైసీపీ విజయ ఢంకా మోగించింది. అయితే ఆయా కార్పోరేషన్ లు, మున్సిపాలిటీలకు సంబంధించి మేయర్, డిప్యూటి మేయర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ ల జాబితా ను నేడు వైసీపీ ప్రకటిస్తుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే జాబీతాపై ఇంకా కసరత్తు పూర్తి కానందున మేయర్, చైర్మన్ ల జాబితా ప్రకటన వాయిదా పడింది.
ఈ సందర్భంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక 70 శాతం వరకూ పూర్తి అయ్యిందన్నారు. ఎంపిక ప్రక్రియ నూరు శాతం పూర్తి కానందు వల్ల అభ్యర్థుల జాబితా ప్రకటించడం లేదని చెప్పారు. గురువారం ఉదయం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. పురపాలక పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. మైదుకూరు, తాడిపత్రి లో ఇరు పార్టీలు సమంగా నిలిస్తే టాస్ ద్వారా చైర్మన్ ఎన్నిక చేపడతారని అన్నారు. ఇతరులను ప్రలోభ పెట్టవద్దనీ, అధికార దుర్వినియోగం చేయవద్దని సీఎం జగన్ ఆదేశించారని సజ్జల తెలిపారు.
కాగా పార్టీలో నేతల మధ్య విబేదాలు ఉన్న చోట్ల సీఎం జగన్ స్వయంగా అభ్యర్థిని ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో లేని విధంగా ఈ సారి పురపాలక సంఘాల్లో రెండేసి డిప్యూటి మేయర్లు, ఇద్దరు వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించారు. దీంతో మేయర్, చైర్మన్ ల పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఆ పదవులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే డిప్యూటి మేయర్, వైస్ చైర్మన్ పదవులతో సంతృప్తి పరిచే అవకాశం ఉంది.