రాజీనామా చేస్తామంటూనే..రాజీ పడ్డారా..!
శాఖలు తీసేసినా..సీఎం సలహాదారుడిగా ఇంకా కీ రోల్
ప్రవీణ్ కు చెక్..అసలు టార్గెట్ అదే
జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న సీనియర్ బ్యూరోక్రట్ ఆయన. సీనియర్ ఐఏఎస్ అధికారిగా పాలనలో అనుభవం..చంద్రబాబు హాయంలో చోటు చేసుకున్న అక్రమాల గురించి తెలిసిన వ్యక్తిగా ఆయన అనుభవం తనకు సహకరిస్తుందని జగన్ భావించారు.
అంతే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన నాటి నుండే చంద్రబాబు నిర్ణయాల పైన మాటల దాడి ప్రారంభించారు. అనేక విషయాల్లో నాటి ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. జగన్ కు దగ్గరయ్యారు. ఎన్నికల్లో ఆయన గెలుపుకు తన వంతు సహకారం అందించారు. ఫలితంగా..తాను ముఖ్యమంత్రిగా ఉండగా..తనకు సలహాదారుడిగా ఉండాలి అన్నా.. అంటూ అజయ్ కల్లం ను జగన్ కోరారు. ఆయన సైతం వెంటనే ఓకే చెప్పేసారు. అనుకున్న విధంగానే జగన్ సీఎం.. ముఖ్యమంత్రి సలహాదారుడిగా అజయ్ కల్లం నియమితులయ్యారు. ప్రభుత్వంలో సీఎస్ తో పాటుగా..సీఎం నిర్ణయాల వెనుక సూత్రధారిగా అజయ్ కల్లం ప్రాధాన్యత పెరిగింది. జగన్ అమలు చేస్తున్న వార్డు సచివాలయాల రూప కల్పన చేసింది అజయ్ కల్లం. దాదాపు 13 నెలల పాటుగా ముఖ్యమంత్రి సలహాదారుడిగా ఉంటూనే..కీలకమైన ఆర్దికం తో పాటుగా అనేక శాఖలు పూర్తిగా అనుభవం ఉన్న కల్లం పర్యవేక్షించే వారు. సడన్ గా ముఖ్యమంత్రి జగన్ కల్లం వద్ద ఉన్న శాఖలను తప్పించారు.
వాటిని ప్రవీణ్ ప్రకాశ్ కు అప్పగించారు. దీంతో..కల్లం ఇక జగన్ నుండి దూరం అయినట్లే..ఆయన ఒకటి రెండు రోజుల్లో రాజీనామా చేస్తారనే ప్రచారం మొదలైంది. కానీ, ఇంతలోనే అజయ్ కల్లం ఢిల్లీలో దర్శన మిచ్చారు. ప్రవీణ్ ప్రకాశ్ స్థానంలో ఆయన ఆర్దిక మంత్రి బుగ్గనతో కలిసి ఢిల్లీ వచ్చారు. దీంతో..అధికారులంతా షాక్ అయ్యారు.
రాజనామా చేస్తారనే ప్రచారం నడుమ…ఢిల్లీలో ప్రత్యక్షం
ఆర్దిక మంత్రి బుగ్గన రాష్ట్ర అంశాల మీద చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారుడి హోదాలో అజయ్ కల్లం సైతం హాజరయ్యారు. కేంద్ర మంత్రికి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి…కేంద్రం నుండి రావాల్సిన సాయం గురించి పూర్తిగా భ్రీప్ చేసారు కల్లం. రెండు రోజుల క్రితమే అజయ్ కల్లం ముఖ్యమంత్రి కార్యాలయంలో చూసే శాఖలను తప్పించి మరో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ కు అప్పగించారు. ముఖ్యమంత్రి 13 నెలల కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాల వెనుక అజయ్ కల్లం ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్ తీసుకున్న పీపీఏల నిర్ణయం…పోలవరం ప్రాజెక్టు..75 శాతం స్థానిక రిజర్వేషన్ల అంశాలు వివాదాస్పదమయ్యాయి. పీపీఏల విషయంలో కేంద్ర అభ్యంతరాల పైన అజయ్ కల్లం రాష్ట్ర ప్రభుత్వం తరపున సమాధానం ఇచ్చేవారు.
అదే విధంగా కీలకమైన వార్డు సచివాలయాలు..అక్కడ ఉద్యోగుల నియామకంలోనూ కల్లందే కీలక పాత్ర. అయితే, సీఎం కార్యాలయంలో ప్రవీణ్ ప్రకాశ్ ఎంట్రీ నుండి అంతర్గతంగా కొన్ని అంశాలు తెర మీదకు వచ్చాయి. నార్త్ లాబీయింగ్ బలంగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ సీఎంఓ లో కీలకంగా మారారు. సీఎం సైతం ఆయన మాటకే ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదన మొదలైంది. అయితే, సడన్ గా తాను ఏరి కోరి తెచ్చుకున్న అజయ్ కల్లం..పీవీ రమేష్ లాంటి వారిని..అన్నా అంటూ వారిని పిలిచే జగన్ ఒకేసారి తన కార్యాలయంలో వారు పర్యవేక్షించే శాఖలను కత్తిరించారు. దీంతో..అజయ్ కల్లం..పీవీ రమేష్ బాధ్యతలు లేకుండా తాము సీఎంఓలో ఉండటం మంచిది కాదని..రాజీనామాకు సిద్దపడినట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రవీణ్ ప్రకాశ్ కు చెక్ పెట్టేందుకేనా..
తమ శాఖలను తీసేయటం వెనుక ప్రవీణ్ ప్రకాశ్ కీలకంగా పని చేసారని అజయ్ కల్లం..పీవీ రమేష్ వంటి వారి అభిప్రాయంగా అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. అజయ్ కల్లం పర్యవేక్షించే కీలకమైన ఆర్దిక శాఖ నుండి ఆయన్ను తప్పించి..ప్రవీణ్ ప్రకాశ్ కు కేటాయించారు. అయితే, రాష్ట్ర ఆర్దిక పరిస్థితులు..కేంద్ర సాయం పైన ఆర్దిక మంత్రి బుగ్గన ఢిల్లీ టూర్ లో మాత్రం మొత్తం అజయ్ కల్లం అంతా తానై నడిపించారు.
దీని ద్వారా..ముఖ్యమంత్రి చెబితేనే అజయ్ కల్లం ఢిల్లీ వెళ్లారా..లేక బుగ్గన అభ్యర్ధన మేరకు ఆయన ఢిల్లీకి వచ్చారా అనేది ఇప్పుడు అధికార వర్గాల్లో సాగుతున్న చర్చ. తనకు శాఖల నుండి తప్పించిన వెంటనే అజయ్ కల్లం అవమానంగా భావించి..రాజీనామాకు సిద్దపడ్డారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఆయన ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో మంత్రితో పాటుగా కీలకంగా వ్యవహరించటం ద్వారా తాను ఇంకా ముఖ్యమంత్రి సలహాదారుడి హోదాలోనే ఉన్నారనే విషయం చెప్పకనే చెప్పారు. అయితే, మరి..జగన్ పైన అభిమానంతో ఆయన వద్దకు చేరిన అజయ్ కల్లం ఇప్పుడు రాజీనామా చేస్తారా..లేక రాజీపడి సలహాదారుడిగా హోదాలో సీఎం వద్దే కొనసాగుతారా..అందుకు సీఎం అంగీకరిస్తారా అనేది ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుంది.