మోడీని పీఎంని చేయడంలో కీలక పాత్ర పోషించాడు…!
చంద్రబాబుని దించడంలో జగన్ కి సాయపడ్డాడు. ఏపీలో ముద్ర వేసాడు..!
కేజ్రీవాల్ ని రెండో సారి గెలిపించి… ఢిల్లీ స్థాయిలోనూ చక్రం తిప్పాడు…!
మమత పిలిస్తే వెళ్లి ఇరుక్కున్నాడు..! పాపం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎదిగిన ఆయనకు మమత పరీక్ష పెద్దదిగా మారింది. బాబుని ఓడించినంత సులువు కాదు మమతని గెలిపించడం అని ఇప్పుడిప్పుడే తెలుస్తుందట మన పీకే అలియాస్ “ప్రశాంత్ కిషోర్” కి… ఆ విషయమేమిటో, అతని కష్టమేమిటో చూద్దాం పదండి..!!
పీకే ఇప్పుడు ఎక్కడున్నారంటే..?
ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో ఉన్నారు. ఏపీలో జగన్ ని సీఎం చేసిన తర్వాత ఢిల్లీ వెళ్లి… అక్కడ కేజ్రీవాల్ ని గెలిపించి… ఆ తర్వాత నేరుగా కోల్కటా వెళ్లారు. అక్కడ మమతని మళ్ళీ సీఎం ని చేసే ప్యాకేజీ కుదుర్చుకున్నారు. ఏపీ రాజకీయం వేరు.. కులాలకు, సెంటిమెంటులకు, డబ్బులకు, రంగులకు లొంగుతుంది..! ఢిల్లీ రాజకీయం వేరు మతానికి, చదువుకి, కొంత మేరకు జ్ఞానానికి లొంగుతుంది…! కానీ బెంగాల్ అలా కాదు. ఓ పట్టాన దేనికి లొంగదు. మొండి నాయకులుంటారు. ఘటాలుగా కూర్చుంటారు. కులాలు, మతాలు, డబ్బు అన్నా లొంగని వాళ్ళుంటారు. అలాంటి చోట పీకే చిక్కుకున్నారు.
ఆయనకు తాజాగా వచ్చిన కష్టం ఏమిటంటే…??
పీకే ప్రధాన లక్ష్యం తృణమూల్ పార్టీని గెలిపించడం. ఇది జరగాలి అంటే ఆ పార్టీకి పోటీగా ఉన్న సిపిఎం, బీజేపీలు బలహీనమవ్వాలి. అంటే జిల్లాల వారీగా ఆ పార్టీల్లో బలమైన నాయకులను గుర్తించి తృణమూల్ లోకి లాగెయ్యాలి. ఆ క్రమంలో పీకేకి కష్టాలొస్తున్నాయి. పీకే టీమ్ సభ్యులకు, వారి మాటలకు లొంగని నాయకులకు నేరుగా పీకేనే మాట్లాడుతున్నారు. ప్యాకేజీలు, పదవులు ఆఫర్ చేస్తున్నారట..! కానీ నో యూజ్..! ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే…!!
* పశ్చిమ బెంగాల్ లోని ఝాల్పైగురి జిల్లాలోని దుప్గురి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఇక్కడ “రాయ్” కుటుంబానికి ఓట్లు దండిగా ఉన్నాయి. జిల్లాలోనూ వారికి పట్టుంది. వారిసగా పది ఎన్నికల్లో వాళ్ళే గెలుస్తున్నారు. సిపిఎం తరపున వరుసగా ఎనిమిది ఎన్నికల్లో ఇక్కడ ఆ కుటుంబ అభ్యర్థులు గెలిచారు. వారిలో బలీయంగా ఉన్న నేత “లక్ష్మి కాంత రాయ్” సిపిఎం నాయకుడు, రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసారు. సదా సీదా జీవనం. మొత్తం ఆస్తులు 4 లక్షలు మాత్రమే. చిన్న పూరిళ్ళులో ఉంటున్నారు. ఈయనను తృణమూల్ లోకి ఆహ్వానించే క్రమంలో పీకేకి చెమటలు పడుతున్నాయట. ఎంత ఇచ్చినా లొంగకపోవడంతో విషయాన్నీ మమతకు చేర్చారట. ఆమె “మీరు ఏం చేస్తారో తెలియదు ఆయన చేరాలి, లేదా…!! అంటూ ఆర్డర్ వేశారు. ఇంకేముంది పీకే అదే ప్రయత్నంలో మళ్ళీ పడ్డారు.
ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే…!?
పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది ఏప్రిల్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి బీజేపీ, తృణమూల్ కి అత్యంత కీలకమైన ఎన్నికలు. మమత రాజకీయ జీవితం దీనితో ముడిపడి ఉంది. ఆమె వరుసగా రెండు సార్లు సీఎం గా ఉన్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. అందుకే ఈమెను ఓడిస్తే బీజేపీకి ప్రాంతీయ శత్రువులు లేనట్టే అనే భావనలో బీజేపీ నాయకత్వం ఉంది. ఈసారి పకడ్బందీగా బీజేపీ రంగంలోకి దిగుతుంది. కేంద్రంలో హవా, వ్యవస్థలతో పాటూ తమ స్టైల్ రాజకీయం నడిపిస్తుంది. మరోవైపు సిపిఎం కూడా ఉనికి కోసం గట్టి పోటీ ఇస్తుండడంతో మమతకు చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకే బీజేపీని ధీ కొట్టే క్రమంలో సిపిఎంలో బలంగా ఉన్న నేతలను మమత పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆ దశలోనే పీకేకి చుక్కలు, రెక్కలు కనిపిస్తున్నాయి.