డిప్యూటీ సీఎం హోదా ఆయనకే..!
జగన్ ఆ ఫార్ములా పక్కన పెట్టేసారా..!!
ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకటరమణ స్థానాలు ఖాళీ కావటంతో వారిద్దరి స్థానాల్లో బీసీ వర్గాలతోనే భర్తీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.
ఈ నెల 20వ తేదీ వరకు ఆషాడ మాసం ఉండటంతో..22న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంగా ఖరారు చేసారు. అయితే, బీసీ వర్గానికి చెందిన మంత్రుల స్థానంలో తిరిగి బీసీలతోనే భర్తీ చేయాల నే నిర్ణయం పైన పార్టీలోనూ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కావటం లేదు. అయితే, సామాజిక సమీకరణాలతో పాటుగా ప్రాంతీయ లెక్కలను పక్కగా జగన్ తన తొలి మంత్రివర్గ ఏర్పాటులో ఫాలో అయ్యారు. ఇక రకంగా జగన్ తొలి కేబినెట్ కూర్పు అన్ని రకాలుగా సమతూకం పాటించారు. అయితే, ఇప్పుడు కొత్తగా మంత్రులయ్యే ఇద్దరి పేర్లు ఖరారయ్యాయంటూ పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో..ఇది పార్టీలోని సీనియర్ల పైన ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. జగన్ గతంలో అనుసరించిన ఫార్ములాను పక్కన పెట్టేసారా..వీరిద్దరినే ఫైనల్ చేస్తే ఎలా అంటూ కొన్ని సందేహాలను తెర మీదకు తెస్తున్నారు. అదే సమయంలో పిల్లి సుభాష్ స్థానంలో బీసీ కోటాలో డిప్యూటీ సీఎం ఎవరనేది మాత్రం ఫైనల్ అయిపోయింది.
ఆ ఇద్దరికీ ఫైనల్ అయ్యాయంటూ…
మంత్రివర్గ సమావేశం అనంతరం గవర్నర్ కోటాలో ఖరారయ్యే ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లతో పాటుగా.. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసే ఇద్దరు మంత్రుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మంత్రుల నుండి రాజ్యసభ కు ఎంపికైన పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకటరమణ సామాజిక వర్గాలకు చెందిన వారినే ఎంపిక చేసే విధంగా ఈ పేర్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సిదిరి అప్పలరాజు ను మత్య్సకార వర్గం నుండి ఎంపిక చేసేసారంటూ ప్రచారం మొదలైంది. మోపిదేవి సైతం అదే వర్గానికి చెందిన వారు. ఇక, రెండో బెర్తు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల క్రిష్ణను ఎంపిక చేసారంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం అదే వర్గం. అయితే, ఇప్పటి వరకు మంత్రులుగా కొనసాగిన ఈ సామాజిక వర్గాలకు చెందిన బోసు..మోపిదేవి ఇద్దరూ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. వారికి ఎమ్మెల్సీ కోటాలో ముఖ్యమంత్రి మంత్రి పదవులిచ్చారు. బోసు అప్పటికే ఎమ్మెల్సీగా ఉండగా..మోపిదేవిని మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసారు. ఇప్పుడు వారిద్దరినీ రాజ్యసభకు పంపి ఆ వర్గాల్లో జగన్ ఇమేజ్ పెంచుకున్నారు. బీసీ వర్గాల్లో పదవులు రాని ఇతర సామాజిక వర్గాలు తమకు అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్న సమయంలో..తిరిగి అవే రెండు వర్గాలకు చెందిన వారితో ఆ స్థానాలను భర్తీ చేయటం పైనా పార్టీలో చర్చ మొదలైంది.
తొలి సారి వారికి ఛాన్స్ ఇస్తారా..
మంత్రి పదవులు ఖరారైనట్లుగా చెబుతున్న అప్పలరాజు..వేణు ఇద్దరూ తొలి సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. ఇక, ప్రాంతీయ సమీకరణాలు చూస్తే ఇప్పటికే ఉత్తరాంధ్ర నుండి శ్రీకాకుళం జిల్లా నుండి స్పీకర్ విజయనగరం జిల్లా నుండి డిప్యూటీ సీఎం ఉన్నారు. అదే విధంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. ఇక, శ్రీకాకుళం జిల్లా నుండే మంత్రిగా ఉన్న బీసీ వర్గానికి చెందిన ధర్మాన క్రిష్ణదాసుకు ఇప్పుడు బీసీ కోటాలో పిల్లి సుభాష్ నిర్వహించిన డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తిరిగి అదే జిల్లా నుండి తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అప్పలరాజుకు ఫైనల్ బెర్త్ దొరుకుతుందా లేదా అనేది చర్చ. ఆయన పార్టీ వాయిస్ వినిపించటంలో..స్వతహాగా డాక్టర్ అయిన అప్పలరాజు కొంత కాలంగా సీఎం కంట్లో పడ్డారు. ఇక, వేణు సైతం రాజకీయంగా అనుభవం ఉన్నా తొలి సారి ఎమ్మెల్యే. ఆయనకు సామాజిక వర్గం..అదే విధంగా పిల్లి బోసు సైతం అదే జిల్లా నుండి మంత్రిగా ఉండటంతో..ఇప్పుడు వేణు తో జిల్లా..సామాజిక వర్గం ఆమనకు కలిసి వచ్చే అంశాలు. అయితే, తొలి సారి ఎమ్మెల్యే అనేది మాత్రమే ఆయనకు ఇబ్బందిగా మారుతోంది.
మోపిదేవి జిల్లాకు పదవి లేనట్లేనా..
ఇక, మోపిదేవి సామాజిక వర్గానికే చెందిన అప్పలరాజు పేరు మంత్రిగా ఖరారైందనే ప్రచారంలో..జిల్లా సమీకరణం దెబ్బ తింటుందనే ప్రచారం తెర మీదకు వచ్చింది. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని మొత్తం 17 స్థానాల్లో 15 సీట్లు వైసీపీ గెలిచింది. ఎన్నికల్లో ఓడినా మోపిదేవికి మంత్రిగా అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆ జిల్లా నుండి హోం మంత్రి సుచరిత ఒక్కరే కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లా నుండి రెండో మంత్రి అవసరం ఉందనేది పార్టీ నేతల వాదన. స్థానిక..మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉండటం..ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న రంగనాధ రాజు కు జిల్లా నేతల పైన అంతగా పట్టు లేకపోవటంతో జిల్లాకు చెందిన వారికే మోపిదేవి స్థానంలో మంత్రి పదవి ఇస్తారనే చర్చ నడుమ..ఈ రెండు పేర్లు తెర మీదకు వచ్చాయి. జిల్లా నుండి బీసీ వర్గం నుండి ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి..చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ పేర్లు రేసులో ఉన్నాయి. అయితే, రజనీ సైతం తొలి సారి ఎమ్మెల్యే. ఇక, జంగా పార్టీలో సీనియర్. అదే విధంగా బీసీ సబ్ ప్లాన్ డ్రాఫ్ట్ కమిటీకి నాయకత్వం వహించారు. కానీ, ఆయన వర్గానికే చెందిన అనిల్ ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. దీంతో..ఏ నిర్ణయం తీసుకున్నా..సామాజికంగా..ప్రాంతాల వారీగా పక్కా సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చే సీఎం జగన్ మంత్రివర్గంలో కొత్తగా ఎవి పేర్లు ఫైనల్ చేస్తారనేది అనేక కోణాల్లో పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.