జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అతనిపై ప్రతిపక్షాలు ఎన్నో రకాలుగా విమర్శలు చేశాయి. అయితే వాటిలో ఏ ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది అనే చెప్పాలి. అడపాదడపా చంద్రబాబు దూకుడు ప్రదర్శించినా అతని ఎత్తులను జగన్ వ్యూహాత్మకంగా తిప్పికొట్టాడు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ వైసీపీ సర్కార్ ఆధ్వర్యంలో తమ విజయవాడ అభివృద్ధిలో పూర్తిగా వెనక్కి వెళ్లిపోయింది అంటూ ఆయన పై మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో విజయవాడను అన్ని విధాల అభివృద్ధి చేశామని కానీ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి నగరం అభివృద్ధిలో వెనుకబడిందని ఆయన ఆరోపించారు.
ఇక పాలనాపరంగా జగన్ కు తొలి ఏడాది రివ్యూల్లో మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడు కేసినేని నాని మాత్రం కొత్త సీన్ ను తెరపైకి తెచ్చారు. చిన్నపాటి వర్షానికే విజయవాడ మునిగిపోతుందని.. కేంద్రం నుండి నిధులు తెఛి మరీ పనులు మొదలుపెడితే ఆ పనులు జరగడం లేదని ఆయన విమర్శించారు. గత రెండు రోజులు పడిన వర్షానికి గుంటూరు నగరంలో ఇళ్లలోకి నీళ్లు వచ్చేశాయి. అలాగే గుంటూరు లోని లోతట్టు ప్రాంతాల్లో అయితే ఈ వర్షాల వల్ల జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
ఇదిలాఉండగా స్ట్రాం వాటర్ డ్రైవ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కు దాదాపు 80 కోట్ల దాకా బిల్లులు ఆపేశారని…. అవి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావని కేంద్ర ప్రభుత్వానివని మరి వాటిని జగన్ ఎందుకు ఆపుతున్నారో అర్థం కావట్లేదు అని నాని అన్నారు. నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కూడా చేశారు. జగన్, బొత్సల కమీషన్ల కోసమే ఆ నిధులు ఆపారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. అధికార పార్టీ నేతలకు కమీషన్లు ఇచ్చేవారికే నిధులు విడుదల చేస్తూ, అలా ఇవ్వని వారికి ఆపేయడం దుర్మార్గమని నాని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి గుడిలో లింగాన్ని దోచేయడం కాదని.. స్ట్రామ్ వాటర్ డ్రైవ్ పనులు ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని అన్నారు.