అయితే ఇలా చేయండి…టీడీపీ సిద్దమేనా…!వైసీపీ ట్రాప్ లో టీడీపీ చిక్కుకుంటుందా..!!
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీని పైన టీడీపీ అధినేత చంద్రబాబు తాము అమరావతి జేఏసీ నిర్ణయాల మేరకు నడుచుకుంటామని ప్రకటించారు. అదే సమయంలో ఈ అంశం పైన ప్రజాతీర్పు కోరాలని..కనీసం రిఫరెండం పెట్టాలని డిమాండ్ చేసారు. ఇక…గవర్నర్ మూడు రాజధానుల బిల్లులకు ఆమోదం తెలిపిన సమయం నుండి ఏ విధంగా తమ నిరసనను కేంద్ర స్థాయికి తీసుకెళ్లాలా అనే అంశం పైన టీడీపీ అధినాయకత్వం తర్జన భర్జన పడుతోంది.
ఇక దశలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఎమ్మెల్యేలంతా మూకుమ్మడగా రాజీనామా చేసి ఆ లేఖలను గవర్నర్ కు ఇస్తారనే ప్రచారమూ జరిగింది. ఇదే సమయంలో వైసీపీ ఫైర్ బ్రాండ్లుగా పేరున్న మంత్రి కొడాలి నాని…ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా టీడీపీ డిమాండ్ చేస్తున్నట్లుగా అమరావతి పరిపాలనా రాజధానిగా కొనసాగించాలంటే టీడీపీ ఒక పని చేయాలని షరతు విధించారు. తామిచ్చే ఈ ఆఫర్ మేరకు టీడీపీ ముందుకొస్తే…
వచ్చే ఫలితాల ఆధారంగా తమ నిర్ణయం మార్చుకోవటానికి తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. మరి..టీడీపీ అందుకు సిద్దమేనా..అమరావతి కావాలంటే…వైసీపీ నేతల ఆఫర్..అమరావతి నుండి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలకు వైసీపీ ముఖ్య నేతలు ఒక బంపరాఫర్ ఇచ్చారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను వ్యతిరికేస్తున్న టీడీపీ అమరాతినే రాజధానిగా కొనసాగించాలంటే ఒక షరతు విధించారు.
టీడీపీలో ఇప్పటికే బయటకు వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలను మినహాయించి..లేదా ఆ ముగ్గురితో కలిపి చంద్రబాబు తో సహా పార్టీ ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేసి ఎన్నికలకు సిద్దం కావాలని మంత్రి కొడాలి నాని..రోజా సవాల్ చేసారు. ఆ స్థానాల్లో తిరిగి టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే తాము అమరావతి నుండి పాలనా రాజధాని మార్పు విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకుంటామంటూ ఆఫర్ ఇచ్చారు. రాజీనామాలకు సిద్దమని టీడీపీ నేతలు లీకులు ఇస్తున్నారని..
అసలు రాజీనామాలకు కలిసి వచ్చేది ఎంతమంది ఉన్నారని మంత్రి కొడాలి ప్రశ్నించారు. అయితే, టీడీపీ నేతలు మాత్రం రాజధాని జిల్లాలైన క్రిష్ణా..గుంటూరుకు చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ తెర మీదకు వచ్చారు. రెండు జిల్లాల్లో ఇద్దరు మినహా అందరూ వైసీపీ వారే ఉన్నారని వారు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిస్తే..తాము ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
రాజీనామాలకు టీడీపీ సిద్దమేనా..శాసన మండలిలో ఆమోదించని బిల్లును గవర్నర్ ఆమోద ముద్ర వేయటాన్ని నిరసిస్తూ కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా చేసారు. అయితే, ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. అమారావతి పైన నిర్ణయానికి నిరసనగా తామంతా రాజీనామాకు సిద్దంగా ఉన్నట్లు టీడీపీ నేతల నుండి వస్తున్న లీకులకు కౌంటర్ గా వైసీపీ నేతలు ఈ సవాల్ చేసినట్లుగా కనిపిస్తోంది.
వైసీపీ నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని ట్రాప్ చేస్తున్నాయని..ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని కాదని తమ వైపు రావటంతో..మిగిలిన ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దంగా లేరనేది వైసీపీ అంచనా. ఉత్తరాంధ్ర..రాయలసీమ టీడీపీ నేతల్లో ఒకరిద్దరు మినహ మిగిలిన వారెవరూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. విశాఖ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే రాజకీయంగా వారికి ఇక ఫ్యూచర్ లేనట్లేననేది వైసీపీ నేతల అభిప్రాయం. అందునా అక్కడి నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారే. ఈ సవాల్ ద్వారా టీడీపీని ట్రాప్ చేయటం.. మరో విధంగా అమరావతి కోసం రాజీనామాలు చేయటానికి కూడా టీడీపీ భయపడుతోందనే ప్రచారం చేయటం ద్వారా మొత్తం మూడు ప్రాంతాల్లోనూ టీడీపీని దెబ్బతీయటం వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. మరి…దీనికి కౌంటర్ గా టీడీపీ అధినేత చంద్రబాబు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి.