టీడీపీలో ఓ కీలక ఎమ్మెల్యే పార్టీని వీడనున్నారు…! ఆ పార్టీ ఓడినప్పటి నుండి సైలెంట్ అయిపోయిన ఆయన.. అధికారంలోకి దూకేయ్యడానికి సరైన సందు చూసుకుంటూ వస్తున్నారు. ఇటీవల అధికార పార్టీ ఒత్తిళ్లు, తన అనుచరులపై కేసులు ఎక్కువవ్వయ్యాయనే సాకుతో ఇక టీడీపీ నుండి వైసిపిలోకి జంపవ్వడానికి ముహూర్తం సిద్ధం చేసేసుకున్నట్టు సమాచారం. ఇంతకూ ఎవరీయన, ఆయన రాజకీయ నైజం ఏంటి..? అనేది చూద్దాం..!
అధికార “గంట” కొట్టడమే పని…!!
ఏపీ రాజకీయాల్లో గంట శ్రీనివాసరావుది ప్రత్యేక నైజం. పార్టీలు, నియోజకవర్గాలు, కండువాలు, రంగులు, జనమూ అనే ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉండవు. అధికారంలో ఎవరుంటే వారికి జై కొట్టడం.., తన పనులు జరిపించుకోవడం… సందు చూసుకుని వ్యవహరించడమే ఆయన శైలి. తాజాగా గంటా శ్రీనివాసరావు వైసిపిలో చేరిపోవడానికి నిర్ణయం తీసుకున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగష్టు 15 న ఆయన జగన్ పంచన చేరిపోవడానికి సిద్ధమవుతున్నారు. అంటే పూర్తిగా కాదు సుమీ…! ఇప్పటివరకు పార్టీలు మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు తరహాలోనే సాంకేతికంగా టీడీపీతో ఉన్నట్టే.., కానీ పార్టీ, మనిషి మాత్రం వైసిపిలో ఉన్నట్టు. వైసిపి కండువా వేసుకోరు, కానీ టీడీపీ కి దూరమవుతారు. జగన్ తో దోస్తీ చేస్తారు, చంద్రబాబుని తిడతారు. ఆగష్టు 15 ఇళ్ల పట్టాలు పంపిణీ వేదికగా ఈ మార్పు జరగనుంది.
మొదటి నుండి అంతే…!
గంట శ్రీనివాసరావు ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో పెద్ద గొప్ప నాయకుడైతే కాదు. ఎందుకంటే వరుసగా ఒక నియోజకవర్గంలో గెలవలేదు. వరుసగా ఒక పార్టీ తరపున పోటీ చేయలేదు. కాకపోతే ఆయన అంటే ఒక బలం, బలగం ఉంటుంది. ఆయన రాజకీయం, నైజం, లాబీయింగులు, చీకటి కోణాలు చాలానే ఉంటాయి. అవన్నీ అధికార పార్టీకి అవసరం. 2009 కి ముందు వరకు టీడీపీ లో ఉంటూ.., 2009 లో ప్రజారాజ్యంలో చేరినా.., 2012 లో కాంగ్రెస్ కి చేరి మంత్రి అయినా.., 2014 లో టీడీపీ లో చేరి మళ్ళీ మంత్రి పదవి చేపట్టినా.., ఇప్పుడు తాజాగా వైసిపిలో చేరినా పెద్దగా ఆశ్చర్యకరం ఏమి కాదు. ఆయన గురించి బాగా తెలిసిన వారు గంటా ఇన్నాళ్లు ప్రతిపక్షంలో ఉండడమే ఆశ్చర్యకరం అంటుంటారు. ఓ సారి ఎంపీగా, ఓ సారి భీమిలి నుండి, ఓ సారి అనకాపల్లి నుండి, మరోసారి విశాఖ ఉత్తర నుండి… ఇలా నియోజకవర్గాలు మారుకుంటూ కొన్ని చీకటి రాజకీయాలు చేసుకుంటూ గెలుచుకుని, రాజకీయ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.
మంత్రి అవంతి పరిస్థితి ఏమిటో…!
ఇప్పుడు గంట చేరికపై మొదటగా అడ్డుకునేది మంత్రి అవంతి శ్రీనివాసరావు మాత్రమే. ఎందుకంటే టీడీపీలో గంటా హవా తట్టుకోలేక, జిల్లాలో పార్టీలో ఆయన డామినేషన్ జీర్ణించుకోలేక వైసిపిలో చేరారు. గెలిచారు, మంత్రయ్యారు. ఇప్పుడు గంటా మళ్ళీ వైసిపికి వస్తే ఊరకే ఉండరు. తన వ్యవహారాల్లో కచ్చితంగా వేలు పెడతారు. గంటా చతురతకి, చాణక్యతకి అధికారులు కూడా గంటాకు గంట కొడతారు. ఇప్పటికే జిల్లాలో విజయసాయిరెడ్డి నీడలో తాను ఉన్నానంటూ లోలోపల రగిలిపోతున్న అవంతి కి ఈ నిర్ణయం మరింతగా చేదు వార్తా. తన హవా తగ్గడం ఖాయం. అందుకే గంటాని తీసుకోవద్దు అంటూ.., గంటా చేసిన వ్యాఖ్యలు, గతంలో జగన్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు అన్నిటినీ విజయసాయి ద్వారానే జగన్ కి చేరవేసినట్టు సమాచారం. కానీ జగన్ నుండి మాత్రం గంటాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది.