అంగరంగ వైభవంగా అయోధ్య రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు ఓవైపు చకచకా జరుగుతుంటే…
మరికొందరు మాత్రం లేనిపోని విమర్శలు, అర్థంలేని మాటలతో మొత్తం కార్యక్రమంపై దుష్ప్రచారం సాగిస్తున్నారు. రామునికి గుడి కట్టాలని దశాబ్దాలుగా యావత్ హిందూ జాతి తపిస్తుంటే… ఇప్పటికీ కొందరు సూడో సెక్యులరిస్టులు దుర్మార్గాలకు తెరదీస్తూనే ఉన్నారు. తాజాగా అయోధ్య రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం సరైన సమయంలో చేయడం లేదంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన విమర్శలు చర్చనీయాంశమవుతున్నాయ్. రేపు శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలంటూ ఇప్పటికే డిగ్గీ రాజా యూపీ సీఎం యోగికి ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. కరోనా సమయమంటూ భౌతిక దూరం అవసరమంటూ చెప్పిన దిగ్విజయ్ మూహూర్తబలం సైతం సరిగా లేదంటూ వాదిస్తున్నారు.
అయితే రామమందిర శంకుస్థాపనకు రేపు దివ్యమైన మూహర్తమని తేల్చేశారు జ్యోతిష్యులు. ముహూర్తం అనేది అనేక విషయాల సమాహారమని అయోధ్యలోని రామాలయ మందిర శంకుస్థాపన ముహూర్తానికి వంద పాయింట్లలో 95 శాతం వరకు సానూకలత వ్యక్తమవుతుందని… ఇలాంటివి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటూ వారు చెబుతున్నారు. రెండు మూడు పాయింట్లు ప్రతికూలత చూపించినందువల్ల వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది వారి అభిప్రాయం. శంకుస్థాపన ముహూర్తం వాయిదా వేసుకోవాలని కొందరు చెబుతున్న లెక్కలు సవ్యమైనవి కావని… రేపు దుర్ముహూర్త ప్రభావం అసలే లేదంటున్నారు.
ఇక ముహూర్త సమయంలో చంద్రుడు బలంగా ఉంటే నక్షత్ర రీత్యాగానీ, వార జనిత దుర్ముహూర్త దోషాలను హరిపంజేస్తాడని తేల్చిచెబుతున్నారు. ముహూర్తానికి చంద్రుడు దశమాధిపతి అవడంతోపాటు పంచమంలో బలంగా ఉన్నాడని….అందువల్ల వారజనిత దుర్మూర్తం పటాపంచలైపోతుందని స్పష్టం చేస్తున్నారు. బుధవారం శతభిష నక్షత్రానికి అమృతయోగం, సిద్ధ యోగం రెండూ ఉండటం గొప్ప విషయమంటున్నారు. ఏదో ఒక యోగం, సిద్ధయోగమో, అమృత యోగమో సాధారణంగా సంభవిస్తాయని… రెండూ అరుదుగా లభిస్తాయంటున్నారు. రామమందిర శంకుస్థాపన ముహూర్తం అత్యంత దివ్యమైన సమయంలో నిర్దేశించారని… వారజనిత దుర్మూహర్త ప్రభావం అసలే ఉండదంటున్నారు.