ముఖ్యమంత్రి గా తన ప్రయాణంలో జగన్ అసలు సిసలు కార్యాచరణ మొదలుపెట్టాడు. తన పార్టీలోనే ఉంటూ తనకు భజన చేస్తూ.. తన వెనుక గోతులు తవ్వుతూ…. చివరికి తనకు ఇబ్బందులు తెచ్చిపెటేవారికి చెక్ పెట్టేలా జగన్ అడుగులు వేయడం ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ రేపుతోంది
అతని చేతికే పవర్
కొన్నాళ్లుగా ఏపీ ప్రభుత్వం పై ఇసుక, మద్యం వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇక అధికార పార్టీ మనుషులే ఇసుకను అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని…. మద్యం అధిక రేట్లకు విక్రయించి కోట్లు గడిస్తున్నారు అని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఊపందుకున్నాయి. ఎంత ప్రతిపక్షాలు అయినా ఇందులో ఎంతో కొంత నిజం ఉంటుందని అనుమానించిన జగన్ ముఖ్యంగా ఇసుక విషయంలో ఎవరి ప్రమేయం ఉందో తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ ను పురమాయించాడు. ఇక ఈ విషయాన్ని దగ్గరుండి నిగ్గు తేల్చేందుకు మంత్రి పెద్దిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారని తెలిసింది.
పార్టీ ముసుగులో జగన్ కు టోపీ
అత్యంత రహస్యంగా జరిగిన ఈ విచారణలో ఒక నివేదిక బయటకు వచ్చాక…. ఆ నివేదికకు సంబంధించి వైసీపీ పార్టీలోకి కొత్తగా అడుగులు వేసిన చాలామంది నేతలు చిన్నచిన్న పనులకు కూడా కక్కుర్తి పడుతున్నారని.. గత ప్రభుత్వంలో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న వారే ఇప్పుడు పార్టీ మారి ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని పెద్దిరెడ్డి నివేదికలో స్పష్టం చేశారట. అదేసమయంలో ప్రజలతో మమేకం కాకుండా పార్టీ సిద్ధాంతాలకు అవసరాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నారని కూడా పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఫోర్స్. దాని ధాటికి నిలబడే వారు లేరు అన్నది వాస్తవం. దానిని అడ్డం పెట్టుకుని వీరంతా ఇసుక రవాణా, మద్యం అక్రమాలకు పాల్పడుతూ అవకతవకలు జరపడం నిజమేనని నివేదికలో ఆయన తేల్చి చెప్పారు
టెన్షన్…. టెన్షన్
ఇప్పుడు ఈ నివేదిక కస్తా జగన్ టేబుల్ పై పడింది. ఈ పరిణామాల్లో ఎవరి పై జగన్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నదానిపైనే ఇప్పుడు పరిశీలకులు దృష్టి పెడుతున్నారు. ఈ లిస్టులో ఎమ్మెల్యేలకు జగన్ జిల్లాల వారీగా పార్టీ తరఫున నియమించిన పార్టీ పరిశీలకుల చేత వార్నింగ్ ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇక ఈ విషయం బయటకు వచ్చాక ఎమ్మెల్యేలందరికీ కొత్త టెన్షన్ మొదలైంది. తమ పేరు లిస్టులో ఉందా లేదా అని భయపడి చస్తున్నారు.
ఇప్పటికే ఈ విషయంలో ముగ్గురు మంత్రులతో పాటు వారి బంధువులకు కూడా జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వార్తలు కూడా బయటకు వచ్చాయి. మరి ముఖ్యమంత్రి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోందో…?