నీటి ప్రాజెక్టుల విషయంలో…. కాలువల విషయంలో ప్రభుత్వం వైఖరి ఎప్పుడూ కొంచెం అటు ఇటు గా ఉంటుంది. కానీ విమర్శలు వచ్చినప్పుడు కూడా పట్టించుకోకుండా ఇలా అడ్డంగా మాట్లాడితే అలాంటి వారిని ఏమనాలి??
ఎంతెంత నిర్లక్ష్యం…?
“కాలేశ్వరం కాల్వలకు అప్పుడే గండ్లు పడుతున్నాయి” అనే వార్తలకు…. విమర్శకులకు…. ” గండ్లు కాల్వలకు కాకపోతే మరి వేటికి పడతాయి” అని ఒక వెటకారపు, వెక్కిరింపు సమాధానం వచ్చింది సదరు తెలంగాణ మంత్రి నుండి. శ్రీశైలం ప్లాంట్ ప్రమాదంపై తెలంగాణ పవర్ చీఫ్ ప్రభాకర్ రావు స్పందన కూడా ఇలాగే ఉంది. పవర్ ప్లాంట్ ప్రమాదాలు కొత్తేమీ కాదు…. యుపి ఎన్టీఫీసీలో లో బాయిలర్ పేలి 30 మంది చచ్చిపోలేదా? తమిళనాడులో ఇలాంటివి జరగలేదా అని అంటున్నారు. ఇలాంటి వ్యక్తా మన పవర్ బాస్? ఇది ఆయన స్పందన తీరు..! అసలు ఆయన ఒక ఇంజనీరె కాదు. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ ఉత్పత్తిని… పంపిణీ కూడా ఆయన నిర్దేశిస్తాడు. ఆయన స్పందన కూడా అచ్చు అలానే ఉంది. అవగాహనా శూన్యత
వెనకున్న ధైర్యం ఎవరు?
అసలు ఇదంతా పక్కన పెడితే… ప్రభుత్వమే సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. వాళ్లు పర్యటిస్తున్న సమయంలో అర్జెంట్ గా ఒక అంతర్గత కమిటీ వేసి…. అందులో తమ వాళ్లందరినీ పోగు చేసుకుని…. మీడియా ని పిలిపించుకొని ప్రమాదాలు కొత్తేమీ కాదు ఏ రాష్ట్రంలోనూ ఎవడూ పరిహారాలు ఇవ్వలేదు… మేము కాబట్టి ఇస్తున్నామని వ్యాఖ్యలు అసలు ఎలా చేస్తారు? ఇది పూర్తిగా అధికార బాధ్యతారాహిత్యం వ్యాఖ్యలు తప్ప మరి ఏమిటి? ఒక రాజకీయ నాయకుడు ఇంతటి అనాలోచిత వ్యాఖ్యలు చేయడం వెనుక అతని ధైర్యం ఏమై ఉంటుంది?
విపక్షానికి ఒక దణ్ణం బాబు..!
ఇక అధికార పక్షం వైఖరి వదిలేస్తే ప్రతిపక్షాలు మరింత దరిద్రంగా ఉన్నాయి. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి దీన్ని జగన్ శ్రీశైలం జల దోపిడీకి ముడిపెట్టి ఏదేదో మాట్లాడేసి…. ఇందులో కేసీఆర్ దొంగనాటకం ఉందని… కేంద్రం కచ్చితంగా కలగచేసుకోవాలి అని అంటున్నాడు. ఎవరికీ ముక్క కూడా అర్ధం కాలేదు. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ – జగన్ భాగస్వాములు అనడమ్ వరకు ఒక రకం. కానీ ఆ ప్రాజెక్టు కోసం విద్యుత్ ప్లాంట్లో కావాలని ప్రమాదం క్రియేట్ చేశారు అనడం ఎంతటి మూర్ఖత్వము ఆయనకే తెలియాలి.
కాబట్టి చివరికి ఎవరైనా చెప్పొచ్చేది ఏమిటంటే… ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం నుండి కాని…. విపక్షాల నుండి గాని అందుకు సంబంధించి రెస్పాన్స్ కు ఎదురుచూడకూడదు. అంటే… అందులో నిజాలు బయట పడకపోగా ఇది చాలా సర్వసాధారణం…. రోజుకి ఎంతో మంది చనిపోతున్నారు.. అక్కడ ఎంతో మంది చనిపోయారు…. కానీ మేము మాత్రమే చనిపోయిన వారికి మేలు చేస్తున్నాం అని అసమర్థత మాటలు వినవలసి వస్తుంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా కరోనా లాగే అనివార్యం అన్నట్లు ఫిక్స్ అయిపోయి తమ జీవితాలను, కాలాన్ని ముందుకు వెళ్ళదీయడం మంచిది.