Visakha Steel Plant ; ఏపీలో రాజకీయం వింతగా మారింది..! ఎంత వింత అంటే దొంగ కళ్ళెదురుగా పారిపోతుంటే పట్టుకోవడం మానేసి… “నీ వల్లనే పారిపోయాడు, నీ వల్లనే పారిపోయాడు” అంటూ ఇద్దరు తన్నుకున్నంత వింతగా ఏపీలో రాజకీయం ఉంది. చివరికి విశాఖ ఉక్కు ఉద్యమం.., విశాఖ ఉక్కుకి మద్దతుగా జరుగుతున్న బందు.., ర్యాలీలు అన్ని అలాగే జరుగుతున్నాయి. ఈ రోజు జరుగుతున్న బందు కూడా దీనికి సాక్ష్యమే..!!
Visakha Steel Plant ; బందులో ఎవరు ఏమంటున్నారు..!?
బందులో టీడీపీ, వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. ఎన్ని పార్టీలు పాల్గొన్నా కీలక పార్టీలు మాత్రం టీడీపీ, వైసిపినే.. ఈ పార్టీల వాయిస్ జనంలోకి వెళ్తుంది. ఈ పార్టీల కార్యకర్తలు, నాయకులే కీలకం. వీళ్ళు యాక్టీవ్ గా ఉంటేనే బందు ప్రభావితం అవుతుంది. విశాఖ సహా… శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు అన్ని ప్రాంతాల్లోనూ బందు బాగానే జరుగుతుంది. ప్రభుత్వం కూడా సహకరించడంతో బందు పూర్తిగా జరుగుతుంది. బస్సులు తిరగడం లేదు, స్కూళ్ళు మూతపడ్డాయి. రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ దీనిలో అంతర రాజకీయమే బంధుని పక్కదోవ పట్టిస్తుంది. టీడీపీ, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే దారి మళ్లిస్తున్నాయి. ఉక్కు ఉద్యమాన్ని పక్కకు నెట్టేస్తున్నాయి.
* బందులో పాల్గొన్న టీడీపీ నేతలు ప్రతీ చోట వైసిపిని విమర్శిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, సీఎం జగన్ పోస్కో కంపెనీతో ఒప్పందం కారణంగానే విశాఖ ఉక్కు ప్రవేటీకరణ జరుగుతుంది అంటూ విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ అవినీతి అని, ప్రభుత్వంలో సంక్షేమం కాకుండా రద్ధులు, కొట్టివేతలు ఎక్కువయ్యాయి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
* బందులో పాల్గొన్న వైసీపీ నేతలు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ నాడు చేసుకున్న ఒప్పందం కారణంగానే.. ఈ రోజు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జరుగుతుంది అని… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వందలాదిగా ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రైవేయీటీకరణ జరిగాయి అంటూ విమర్శలు చేస్తున్నారు.
అసలు దోషిని ఏమి అనలేక..!!
ఒక్కటి మాత్రం స్పష్టం. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణలో మొదటి దోషి కేంద్రం. మొదటి కారకుడు ప్రధాని మోడీ. ఆ తర్వాతే జగన్ అయినా.., చంద్రబాబు అయినా… కేంద్రం ప్రమేయం, అధికారం, నిర్ణయం లేకుండా కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమని రాష్ట్ర ప్రభుత్వం టచ్ కూడా చేయలేదు. ఈ విషయాన్నీ బాగా తెలిసిన టీడీపీ, వైసీపీలు కూడా బందు సాక్షిగా బీజేపీని ఏమి అనలేక… ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. బీజేపీని, ప్రధాని మోడీని, అమిత్ షాని ఏమి విమర్శించలేక… విశాఖ ఉక్కు వేదికగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేక… ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. ఇలా చేస్తుంటే… ఎన్ని బందులు చేసినా… ఎన్ని ర్యాలీలు చేసినా ఫలితం ఉండదు. బీజేపీ దిగిరాదు..!!