జగన్ కన్నెర్రజేస్తే.., కోపం వస్తే.., పట్టుపడితే..!! రాజధాని నిలవలేదు, ఎన్నికల కమీషనర్ మూడు చెరువుల నీళ్లు తాగారు.., చంద్రబాబు హైదరాబాద్ కి పరిమితమయ్యారు.., ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ఓ లెక్కా…?? మొదట చుక్కలు కనిపిస్తాయి.., ఆ తర్వాత పంజా పడుతుంది. చివరిగా జగన్ ప్రతాపం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు, మరో మాజీ ఎమ్మెల్యేకి అదే జరిగింది.
ఓ సీనియర్ ఎమ్మెల్యే తనను మోసం చేసాడు..! వైసీపీ నుండి గెలిచి 2015 లో టీడీపీలో చేరిపోయాడు..! అది జగన్ ని బాధించింది. మనసులో పెట్టుకున్నాడు. టైం వచ్చే వరకు వేచి చూసాడు, పంజా వేసాడు..! నిబంధనలు, కోర్టులు, నివేదికలు ఏమి లేవు. అక్రమం జరిగింది, క్వారీ మూసేయ్ అంతే..!! ఆ దెబ్బ ఏంటో, ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం పదండి.
అలా దారిలోకి తెచ్చుకున్నారు..!
ప్రకాశం జిల్లాలో రాజకీయానికి ఆర్ధిక మూలం గ్రానైట్ వ్యవహారాలే. గడిచిన రెండున్నర దశాబ్దాల నుండి గ్రానైట్ వ్యాపారులు జిల్లాలో రాజకీయాలను శాసిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ వీరిదే హవా. చీకటి బాగోతాలు, లెక్కల్లో లోపాలు.., మామూళ్లతో నెట్టుకొచ్చారు. కానీ.., జగన్ వచ్చాక వారి ప్రతాపం పని చేయలేదు. గ్రానైట్ అక్రమాలపై జగన్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. క్షుణ్ణంగా తనిఖీలు చేసి, అక్రమాలు నిగ్గుతేల్చి 20 క్వారీలకు రూ. 2085 కోట్లు ఫైన్ వేసింది. దీంతో సుదీర్ఘ కాలం అక్రమాలతో నెట్టుకొచ్చిన గ్రానైట్ వ్యాపారులు ఇక జగన్ కి తలవంచారు. మీరే దిక్కు అంటూ జగన్ పంచన చేరిపోయారు. వైసీపీ కండువా కప్పేసుకున్నారు. “కొందరికి కప్పం కట్టేసుకున్నారు”..! మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సహా, ఎమ్మెల్యేలు సహా కీలక వ్యాపారులు అందరూ గతంలో తిట్టిన నోళ్లతోనే జగన్ కి జై కొట్టారు. కానీ ఒక్క ఎమ్మెల్యే మాత్రం వైసిపిలో చేరలేదు. (ఆయన చేరలేదు అని ఆయన వర్గం అంటుంది. జగన్ చేర్చుకోలేదు అని ప్రత్యర్థి వర్గం అంటుంది. నిజాలు చాలా ఉన్నాయి).
గ్రానైట్ లో అక్రమాలు..! క్వారీ మూసివేత..!!
ప్రకాశం జిల్లాలో ఫైన్ లు పడిన అందరి క్వారీల పని ఇక అయిపోయినట్టే అనుకున్నారు. కానీ అందరూ తప్పించుకున్నారు. అధికార పార్టీలోకి దూకేశారు. ఆ పార్టీలోకి వెళ్లని/ జగన్ చేర్చుకొని
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులుకు చెందిన గ్రానైట్ వ్యాపారాలపై తాజాగా దెబ్బ పడింది. ఆ ఇద్దరి క్వారీలు లీజులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు ఇచ్చింది. గొట్టిపాటి చెందిన క్వారీకి రూ. 285 కోట్లు, పోతుల రామారావుకి చెందిన క్వారీకి 90 కోట్లు ఫైన్ వేశారు. అయితే వీరు అధికార పార్టీకి లొంగకపోవడం, జగన్ కి కూడా ఇష్టం లేకపోవడం.., వీళ్ళిద్దరూ తరచూ క్వారీలు ఓపెన్ చేసుకోవడం, ప్రభుత్వంపై కోర్టుకి వెళ్లడంతో విసిగిపోయిన అధికారులు పాత తప్పులను చూపించి పూర్తిగా లీజులను రద్దు చేసి పడేసారు.!!
మొదట మనం చెప్పుకున్నాం కదా..! ఓ సీనియర్ ఎమ్మెల్యే తనను మోసం చేసిన విషయాన్నీ జగన్ మనసులో పెట్టుకున్నాడు అని…! ఆ ఎమ్మెల్యేనే గొట్టిపాటి రవికుమార్..! ఆ దెబ్బే ఇది..!!