YV Subbareddy: వైసీపీలో అసమ్మతులు/ అసంతృప్తులు చాలానే ఉన్నాయి. అధికార పార్టీ అంటే ఇవన్నీ సహజమే. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఈ కోవలోకి వచ్చి, రానట్టే ఉంటారు. సొంత మనిషి కాబట్టి అలిగిన, బయటకు వచ్చినా బాగోదు.. లేకపోతే వైవీ తనకున్న అసంతృప్తికి ఏనాడో మరో దశకు వెళ్లేవారు.. ఇటీవల వైవీ తమ సీఎం జగన్ దగ్గర కొన్ని కోరికలు పెట్టారు. 2019 ఎన్నికలకు ముందు, తర్వాత ఏదో ఒక తెలియని అసమ్మతి, అసంతృప్తితో లోలోపల నలిగిపోతున్న వైవీ ఇప్పుడు మాత్రం స్టీరింగ్ తన చేతిలోకి తీసుకోవాలి అనుకుంటున్నారట.. ఇది సాధ్యమేనా..!? పార్టీలో రాష్ట్రస్థాయి నేతకు ఇప్పుడు ఈ చిక్కులేందుకు..!?
YV Subbareddy: మంచి నేతగా గుర్తింపు.. కానీ..!
2014 ఎన్నికల్లో ఒంగోలు నుండి ఎంపీగా గెలిచి వైవీ బాగానే పని చేశారనే గుర్తింపు తెచ్చుకున్నారు. జిల్లాలోని కీలక సమస్యలపై పార్లమెంటు స్థాయిలో గళమెత్తుతూ.., కేంద్రం నుండి బృందాలను జిల్లాకు రప్పిస్తూ ఎంతో కొంతే చేయాలనే ప్రయత్నం చేసేవారు. మధ్యలో పాదయాత్ర కూడా చేశారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో మరింత భారీ గెలుపు ఖాయం అనుకున్నారు. కానీ ఏం ఉపయోగం. 2019 ఎన్నికల్లో సీటు దక్కలేదు. 2014 నుండి జిల్లాలో పార్టీని మోసిన తనను కాదని.., ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లాలో పార్టీని పట్టించుకోని బావమరిది బాలినేని పెత్తనమే సాగింది.. టీడీపీ నుండి వచ్చిన మాగుంటకు ఎంపీ సీటు వెళ్ళిపోయింది. వైవీ గట్టిగా అడిగినా ఫలితం లేదు. మళ్ళీ తిరిగి వచ్చి పార్టీ పనుల్లో గడిపారు. పార్టీ గెలిచాక రాజ్యసభ అనుకున్నారు.. కానీ ఖాళీ లేకపోవడంతో టీటీడీ చైర్మన్ తో సరిపెట్టుకున్నారు.. రెండేళ్లు గడిచింది. ఇప్పుడు మళ్ళీ అదే టీటీడీ అంటున్నారు. ఆయన కేమో మంత్రిగా చేయాలనుంది. జిల్లాలో పెత్తనం చేయాలనుంది. సొంత బావమరిది బాలినేనికీ, వైవీకీ పొసగదు. మొదటి నుండీ అభిప్రాయం భేదాలున్నాయి.. దీంతో జగన్ వైవీని తెరవెనుక రాజకీయాలకు.. బాలినేనిని తెరముండు రాజకీయాలకు వాడుకోవాలి అని మొదటి నుండీ భావించారు. కానీ వైవీ సొంత జిల్లాకు, సొంత మనుషులకు ఏమి చేయలేకపోయారు. అడిగిన పనులు చేయలేకపోయారు. చూస్తూ చూస్తూనే క్యాడర్ చేజారిపోయారు. ఎంపీగా తాను కట్టుకున్న రాజకీయ పునాదులు కూలిపోయాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ వైవీ కోరిక పెరిగింది.. తనకు పెత్తనం కావాలనిపించింది.. సీఎం చెవిన వేశారు.. మంత్రిగా పని చేయాలనేది వైవీ కోరిక. మంత్రిగా జిల్లాలో తన వాళ్ళకు అందుబాటులో ఉండాలనేది వైవీ పెద్ద కోరిక..
పెద్ద పోటీ… పెద్దాయనలు పోటీ..!?
మంత్రి వర్గంలో స్థానం కోసం ఇప్పటికే చాలా మంది పోటీ పడుతున్నారు. దాదాపు తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత పార్టీ అధికారంలోకి రావడం.. పైగా 151 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో పార్టీలో సహజంగానే మంత్రి పదవుల కోసం పోటీ ఉంటుంది. వారికే సర్దుబాటు చేయడం కష్టంగా ఉన్న తరుణంలో ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్ల నుండి మంత్రి పదవి కోరికలు బయటపడుతున్నాయి. వైవీకి రాజ్యసభకు పంపించాల్సి ఉన్నప్పటికీ ఖాళీలు లేకపోవడం.., సామజిక సమీకరణాలు కలిసి రాకపోవడంతో ఆ అవకాశం రావట్లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వైసీపీలో నాలుగు రాజ్యసభలో ఖాళీ అవుతాయి. కానీ అప్పుడు కూడా వైవీకి కష్టమే. పైగా ఈయనకు మంత్రి పదవి ఇస్తే బాలినేనికి మంత్రి పదవి తీసేసి, మరో పదవి ఇవ్వాలి. అది పార్టీకి మరింత తలనొప్పిగా మారుతుంది. అందుకే ఈ సర్దుబాట్లు ఎలా ఉండబోతున్నాయనే సందేహాలు చాలా మంది నేతల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.