Vijayamma: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల సోదరుడు ఏపి సీఎం వైఎస్ జగన్ అభీష్టానికి భిన్నంగా తెలంగాణలో రాజకీయ పార్టీ ఆవిర్భావం చేసిన సంగతి తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు రెండు రాష్ట్రాల్లో వేరువేరు పార్టీలకు చీఫ్ లు ఉండటం భారతదేశ చరిత్రలో ఇదే ప్రధమం కావచ్చు. జగన్ ఏపిలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడుగా, సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, తన సోదరి వైఎస్ షర్మిల పొరుగు రాష్ట్రం తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలిగా పార్టీని ప్రకటించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన నాటి నుండి జగన్ ఆమెకు దూరంగా ఉన్నట్లు తెలుస్తూనే ఉంది.
అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీకి ఆయన తల్లి విజయమ్మ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ హోదాతోనే కుమార్తె షర్మిల పార్టీ పేరు విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్ఒసి) ఇసీకి ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. షర్మిల రాజకీయ పార్టీ సన్నాహాలు ప్రారంభించినప్పటి నుండి విజయమ్మ ఆమె వెంటే నడుస్తున్నారు. ఖమ్మంలో జరిగిన సభలో, హైదరాబాదులో నిరుద్యోగ సమస్యపై షర్మిల నిర్వహించిన నిరాహార దీక్ష కార్యక్రమంలో షర్మిలతో కలిసి విజయమ్మ పాల్గొన్నారు. వైఎస్ఆర్ టీపీ ఆవిర్భావ సభలోనూ పాల్గొని ప్రసంగించారు. నిన్న పులివెందులలో జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లోనూ విజయమ్మ కుమార్తె షర్మిలతోనే పాల్గొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్ష పదవిలో ఉన్నట్టా? లేనట్టా? కుమార్తె పార్టీ అయిన వైఎస్ఆర్ టీపీలో చేరిపోయారా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల నుండి వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు వైఎస్ఆర్ సీపీ అధికార పత్రిక సాక్షిలోనూ విజయమ్మ పేరు ముందు గతంలో రాసిన విధంగా నేడు వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు అని సంభోదించకపోవడం కూడా ఈ కన్ఫ్యూజన్ కు కారణం అవుతోంది. కుమార్తె షర్మిల పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్న కారణంగా విజయమ్మ స్వయంగా వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ సీపీ నా, లేక వైఎస్ఆర్ టీపీనా అనే విషయంపై పార్టీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.