నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్.. రామారావు ఘన చరిత్ర ఒక పక్క, బాలకృష్ణ-క్రిష్ ల కలయిక మరోపక్క.. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ సినిమాలోని మొదటి పార్ట్ కథానాయకుడు సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది అనుకుంటే పాతిక కోట్లు కూడా రాబట్టలేక చతికల పడింది. ఫస్ట్ పార్ట్ అంతా రామారావు సినీ ప్రయాణాన్ని సాగదీసి చూపించడం, ఆకట్టుకునే కథనం లేకపోవడం కథానాయకుడు సినిమా కలెక్షన్స్ కి పెద్ద అడ్డంకిగా మారింది. ఈ స్థాయి రిజల్ట్ ని ఊహించని బాలయ్య-క్రిష్ లు ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని కాస్త ఘాటుగానే చూపించాలని డిసైడ్ అయ్యారట. ఫస్ట్ పార్ట్ కథానాయకుడు ఎండింగ్ లో తెలుగు దేశం పార్టీ స్థాపించడంతో ముగిసింది కాబట్టి ఈ పార్ట్ 2 తోరామారావు రాజకీయ జీవితాన్ని మళ్ళీ ప్రజలకి చూపించి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మంచి మైలేజ్ తీసుకురావాలని బాలయ్య భావించాడు. అయితే కథానాయకుడు రిజల్ట్ దెబ్బకి పార్టీని పక్కన పెట్టి సినిమాని నిలబెట్టాలని ఆలోచిస్తున్నాడట. అవసరమైతే కాంట్రావర్శి కంటెంట్ ని టచ్ చేసి అయినా సరే మహానాయకుడు మైలేజ్ పెంచాలని ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్, ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ కి ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. మహానాయకుడు సినిమాని కాపాడుకోవాలని చూస్తున్న బాలయ్యకి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి, అది కూడా తన కుటుంబ సభ్యుల నుంచే కావడం విశేషం.
ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకి వచ్చిన ఆ కొత్త చిక్కులు, స్వయంగా బాలకృష్ణ బావ చంద్రబాబు నుంచే. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం.. వచ్చే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఉండబోతుంది అనే కంఫోర్మషన్ రావడంతో… ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులు వాడి వేడిగా ఉన్నాయి. రాజకీయాల ప్రస్తావన కాస్త పక్కన పెడితే చంద్రబాబు చేసిన ఈ పని వలన బాలకృష్ణ, క్రిష్ తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. ఎన్టీఆర్ సినిమాకి టీడీపీ ఆవిర్భావం, దాని వెనకున్న కారణలే ప్రధాన బలం, ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఎన్టీఆర్ సినిమాకి అదే సెల్లింగ్ పాయింట్..
దాదాపు నాలుగు దశాబ్దాలు వెండితెర ఇలవేల్పుగా ఒక వెలుగు వెలుగుతూ హీరోగా కనిపించిన నందమూరి తారక రామారావ్రామారావు, అప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అనే నినాదం తీసుకొని, తెలుగు దేశం పార్టీ పెట్టి తెలుగు ప్రజలకి అంకితం ఇచ్చాడు. అంటే తెలుగు దేశం పార్టీ పుట్టుకలోనే కాంగ్రెస్ పార్టీపై వెతిరేకత ఉంది. కాంగ్రెస్ ని ఓడించడమే లక్ష్యంగా చేసుకొని ఎన్టీఆర్ ప్రసంగాలు సాగేవి, ఎన్టీవోడి పిలుపుకి తెలుగు ప్రజలు కదిలొచ్చారు… కలిసొచ్చారు… ఓట్లు వేసి టీడీపీని గెలిపించారు. ఇప్పుడు ఇదే మెయిన్ హైలైట్ గా చేసుకొని ఎన్టీఆర్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే చంద్రబాబు చేసిన పని వలన ఎన్టీఆర్ సినిమాకి ప్రధాన బలమైన పాయింట్ ఇప్పుడు వీక్ గా మారింది. రామారావు పార్టీ ఆవిర్భావం నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యేదాకా పవర్ఫుల్ సీన్స్ తో రాసుకొని షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న సినిమాని ఇప్పుడు రీ-షూట్ చేయలేరు, అలాగని మార్చకుండా అలానే ఉంచలేరు. ఒకవేళ అలానే ఉంచితే వచ్చే టీడీపీ-కాంగ్రెస్ పొత్తుకే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది, లేదా రీ-షూట్ చేస్తే ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో అసలు విషయమే ఉండదు.
ఈ కారణంగానే బాలకృష్ణ-క్రిష్ లు చాలా కన్ఫ్యూషన్ లో పడ్డారట, సినిమా హిట్ చేయడం కోసం తీసిన సీన్స్ అలానే ఉంచాలా లేక, ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం సినిమాలో మార్పులు చేయాలా అనేది అర్ధం కాకా బాలయ్య డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే మహానాయకుడు సినిమా ఆలస్యమవుతోంది. అయితే ఎవరు చెప్పిన చెప్పక పోయినా, చూపించినా చూపించకపోయనా, రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లి గెలిచాడు అనేది చరిత్ర చెప్పిన నిజం. దాన్ని అలానే చూపించి బాలయ్య, తన తండ్రి గౌరవాన్ని కాపాడుతాడా లేక బావ కోసం అలోచించి చారిత్రక తప్పిదం చేస్తాడా అనేది చూడాలి.