సినిమాల్లో హీరోయిన్లుగా రాణించాలంటే అందం మాత్రమే కాదు.. అభినయం కూడా ముఖ్యం. ఇవన్నీ ఉన్న హీరోయిన్లకు అదృష్టం కూడా తోడవ్వాల్సిందే. అయితే.. సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటూ స్టార్ హీరోయిన్లు అయితే.. మరికొందరు తొలి సినిమాతోనే సక్సెస్ సాదించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లు అయిపోతారు. టాలీవుడ్ లో అలా నిలిచే హీరోయిన్లలో ‘రకుల్ ప్రీత్ సింగ్’ ఒకరు. తెలుగులో తన మొదటి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తోనే సక్సెస్ అందుకుని టాలీవుడ్ లో పాగా వేసింది. ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి ఏకంగా వరుస సక్సెస్ లతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. నవంబర్ 29తో రకుల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 7ఏళ్లు పూర్తి చేసుకుంది.
2013లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ హిట్ అయింది. 2014లో లౌక్యం, కరెంట్ తీగ హిట్, యావరేజ్ లుగా మిగిలాయి. తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లోనే చేసింది. 2015లో రామ్ చరణ్ బ్రూస్ లీ, రవితేజ కిక్2, 2016లో ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో సరైనోడు, రామ్ చరణ్ తో ధృవ.. సినిమాలు చేసింది. 2017లో మహేశ్ తో స్పైడర్, నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల్లో నటించింది. తమిళ్ లో ఎన్జీకే, దేవ్, హిందీలో మీర్జావాన్, దేదే ప్యార్ దే.. వంటి సినిమాలు చేసింది. కెరీర్లో సక్సెస్, ఫెయిల్యూర్స్ సమంగానే ఉన్నా స్టార్ హీరోయిన్ గా రకుల్ క్రేజ్ కు ఢోకా లేకుండా పోయింది.
టాలీవుడ్ లో తన ఏడేళ్ల ప్రస్థానంపై సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ #7YearsForRakulPreethinTFI అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. దీనిపై రకుల్ స్పందించింది. ‘ఢిల్లీ అమ్మాయిని తెలుగు అమ్మాయిగా భావించారు. ఇన్నాళ్లూ నన్ను ఎంతో ప్రేమతో ఆదరించారు. ఈ ఏడేళ్ల జర్నీ ఎంతో సంతోషంగా ఉంది. ఇందుకు కారణమైన దర్శకులు, నిర్మాతలు, తోటీ నటీనటులు, ప్రేక్షకులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా కుటుంబం, మేనేజర్, శ్రేయోభాలాషులు లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదు’ అని తన సోషల్ మీడియాలో రాసుకుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 7 సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.