Political Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీ 60 ఎమ్మెల్యే స్థానాలు కోల్పోతుంది – రెండు వారాల వైరల్ వచ్చిన ఒక సర్వే సారాంశం ఇది..!
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో జగన్ 5 శాతం ఓట్లు కోల్పోనున్నారు – రెండు రోజులుగా లోకల్ యాప్ సర్వే అంటూ వస్తున్నా వార్త ఇదీ..!
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో 11 మంది సిటింగ్ మంత్రులు ఓడిపోనున్నారు – లోకల్ యాప్ అని చెప్తున్న సర్వే సారాంశం ఇది..!
జగన్ కంటే ఎంపీ రఘురామకృష్ణంరాజుకి 19 శాతం ఎక్కువ ప్రజాదరణ ఉంది – తాజాగా ఈరోజు రఘురామ బయటపెట్టిన సర్వే ఇదీ..!
వాయమ్మో… ఏపీ మొత్తం జగన్ కి వ్యతిరేకమేనట.. జగన్ ఓడిపోతారట..? మరి ఈ లచ్చల కోట్ల సంక్షేమ పథకాలు ఏమైనట్టు..? సరే కాసేపు నమ్మేద్దాం..! నమ్ముతూనే కాసేపు ఈ పార్టీలను, నాయకులను, ప్రాంతాలను పక్కన పెట్టి ఈ సర్వేల ఉద్దేశాలు, అంతర్గత వాస్తవాలు కాసేపు మాట్లాడుకుందాం..!
Political Survey: ఈ కఠోర వాస్తవం మర్చిపోకూడదు..!
జగన్ పై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే కావచ్చు. జగన్ పరిపాలన తీరు కొన్ని వర్గాలకు నచ్చకపోవచ్చు. ఉద్యోగ, నిరుద్యగ, విద్యావంతులు, ఉపాధ్యాయుల్లో జగన్ పరిపాలన పట్ల కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతున్న మాట వాస్తవమే కావచ్చు. కానీ మాస్ ఓటింగ్ లో జగన్ ఇప్పటికే 2019 నాటి జగనే… పల్లెల, పేదల ఓటింగ్ లో జగన్ ఇప్పటికీ 2019 నాటి జగనే.. ముఖ్యంగా గ్రామీణ మహిళా ఓటింగ్ లో ఇప్పటికీ జగన్ 2019 నాటి జగనే.. ఆ విషయాలు అంగీకరించాలి. అంటే 2019 ఎన్నికలతో పోలిస్తే జగన్ కాస్త బలహీనపడవచ్చు. అన్ని వర్గాలను సంతృప్తి పరచడం రెండేళ్లలో సాధ్యం కాదు. అందుకే కొన్ని వర్గాలు జగన్ కి దూరమవుతున్నాయి. కానీ దూరమైనా వర్గాలను దగ్గర చేసుకోవడమూ పెద్ద కష్టం కాదు. అంచేత జగన్ కి వాస్తవంగా వ్యతిరేకత ఉన్న ఉద్యోగ, నిరుద్యగ, విద్యావంతులు, ఉపాధ్యాయ, పట్టన యువ ఓటర్లను ఆకట్టుకునే ఒకటో, రెండో బాణాలు జగన్ దగ్గర లేకపోలేవు. అవన్నీ వచ్చే ఏడాది బయటకు తీసే అవకాశాలు లేకపోలేదు. సో… వ్యతిరేకత నిజమైన వ్యతిరేకత కాదు, రాజకీయంగా జగన్ ని ఇబ్బంది పెట్టె వ్యతిరేకత కాదు.. ఈ ఓట్లేమీ చంద్రబాబుకి గంపగుత్తగా పడిపోయే సీన్ లేదు..!
సర్వేల్లో లెక్కలు బోలెడున్నాయి..!?
సర్వే అంటే ఇప్పుడు చీప్ అయిపొయింది. ఆ మహత్తర భాగ్యం మూటగట్టుకున్నది “లగడపాటి రాజగోపాల్” గారే.., ఆపై ఇప్పుడు పెరుగుతున్న సోషల్ మీడియా విభగాలు, డిజిటల్ మీడియా సంస్థలు కూడా..! సర్వే అన్నా.., రాజకీయ ప్రజానాడి అన్నా ఒకప్పుడు మాంచి ఉత్సుకత, ఆసక్తి ఉండేది. కానీ గడిచిన అయిదేళ్లుగా డిజిటల్ మీడియా సంస్థలు దాన్ని నీరుగార్చాయి. మూడేళ్ళ కిందట దాన్ని లగడపాటి రాజగోపాల్ పూర్తిగా సర్వేలపై నమ్మకం లేకుండా చేశారు.
* సర్వేలంటే ఆషామాషీ కాదు. బోలెడన్ని లెక్కలున్నాయి. నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్ల అభిప్రాయాలు తీసుకున్నారు..!? ఏ ఏ వర్గాల అభిప్రాయాలూ తీసుకున్నారు..!? ఏ సామాజికవర్గ అభిప్రాయాలు తీసుకున్నారు..!? ఏ ప్రాంతంలో ఎన్ని నమూనాలు తీసుకున్నారు..? ఏ సమయంలో తీసుకున్నారు..? అనేది కూడా కీలకమే.
* పైన మనం చెప్పుకున్నట్టు వర్గాల వారీగా వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ సర్వేలు పని చేయవు. ఒక నియోజకవర్గంలో కనీసం 6 నుండి 8 శాతం నమూనాలు తీసుకోవాలి. దీనిలోనూ ఎస్సి, బీసీ, ఓసీ, యువత, ముసలి అన్ని వర్గాల, వయసుల అభిప్రాయాలు తీసుకోవాలి. అన్నిటికీ మించి అడిగిన ప్రశ్నల్లో కూడా సర్వే ఫలితం తారుమారవుతుంది.
* ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా పోటీలో లోతుగా.. నిజంగా ప్రజాభిప్రాయాన్ని పసిగట్టగలిగే సర్వేలు చేసేంత సీన్ ఎవ్వరిలో లేదు. లోకల్ యాప్, ఇండియా టుడే కూడా కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా చేసినవే. నేరుగా కలిసి ప్రశ్నలు అడిగి, ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నవి అయితే కాదు. అంచేత దీనిలో నమ్మదగిన అంశాలు లేవు..! టీడీపీ భుజాలు ఎగరేసుకోవద్దు. వైసీపీ బెంగ పెట్టుకోవద్దు. కానీ జగన్ మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే. కొన్ని వర్గాల్లో వ్యతిరేకతని పోగొట్టుకునే ప్రయత్నాలు చేయాల్సిందే.. లేకపోతే ఈ సర్వేలకు మించిన నష్టం ఎదుర్కోకతప్పకపోవచ్చు..!!