(నోట్ : ఇది వాస్తవం, కానీ కథలానే చదవండి. చివర్లో చాలా వరకు మీకు అర్ధమవుతుంది. కొన్ని అంతర్గత విషయాలు కథనంలో పేర్కొన్నాము. పేర్లు పూర్తిగా ఇవ్వలేము) అనగనగా ఒక సామంత రాజ్యం..! ధనిక రాజ్యం. చాలా మంది కళ్ళు పడిన రాజ్యం, మహారాజుకి “ముఖ్య”మైన రాజ్యం అది. అక్కడ ఇద్దరు రాజులున్నారు..! ఒకరేమో సామంత రాజుకి ఎక్కువ, మహారాజుకి తక్కువ. మరొకరు పక్కా సామంత రాజు. కానీ దర్పం, పెత్తనం పూర్తిగా కావాలనుకునే రాజు. వీరిలో ఎవరికీ పెత్తనం..? ఎవరిది దర్పం…? అనేది తేలక కొద్ది నెలలుగా వివాదం నలుగుతుంది. అనేక మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు, వివాదాలు, అంతర్యుద్ధాలు ఏమిటో తెలుసుకోడానికి కథలోకి వెళదాం పదండి.
భూముల విషయంలో మొదలు…!
అది ధనిక రాజ్యమని, అందరి కళ్ళు పడిన రాజ్యమని.., మహారాజుకి ముఖ్యమైన రాజ్యమని ముందే చెప్పుకున్నాం. అందుకే అక్కడ భూములపై అందరి కళ్ళు ఉంటాయి. ఈ క్రమంలోనే సామంత రాజుల కళ్ళు పడ్డాయి. తమ వారికి కొనుగోలు చేసి పెట్టాలని ఒక రాజు, లేదు తమ వారికే కొనుగోలు చేయాలని మరో రాజు రోజుల తరబడి చర్చలకు దిగారు. చివరికి ఏమి తేలక ఒకరికొకరు ఆరోపణలకు దిగారు. పిర్యాదులు చేసుకున్నారు. ఆ రాజ్యంలో కొన్ని కీలక ప్రాంతాల్లో మొత్తానికి కొన్ని భూములు సమకూర్చుకున్నారు. మొత్తానికి ఆ ముఖ్యరాజ్యం ఒకరికి సొంతిల్లు(ఇలాఖా)గా ఉండగా… మరో సామంత రాజుకి అద్దె ఇల్లు వంటిది. కానీ ఈయనదే అక్కడ తడాఖా మొత్తం. కానీ రిజిస్ట్రేషన్లు దగ్గర మళ్ళీ పేచీలు వచ్చాయి. ఇక్కడితో ఈ విషయాన్నీ పక్కన పెడదాం..!
నాయకుడితో నారి…!
ఆ రాజ్యానికి స్థానిక ఎన్నికలు వస్తే మేయరు పీఠం ఎవరికీ కట్టబెట్టాలి అనేది చర్చ. దీనికి ఓ సామంత రాజు తన కుమార్తెకి ఇవ్వాలని పట్టు పడుతున్నారు. కానీ మరో సామంత రాజు మాత్రం మరో నారికి హామీ ఇచ్చారని ప్రచారంలో ఉంది. అసలే కీలక రాజ్యం, మహారాజు గారికి ముద్దుల రాజ్యం, ముఖ్యమైన రాజ్యం. మరి మేయరు పీటమంటే “మామూలు” మాటలు కాదుగా…!! అందుకే “మామూలు”గానే ఓ సామంత రాజు ఓ నారీకి హామీ ఇచ్చారు. అందుకు చీకటిగానో, వెలుతురులోనో కప్పం కట్టించుకున్నారని ఆ రాజు సన్నిహితుల నుండి వస్తున్నా మాటలే. ఇక్కడ మరి ఈ రాజులకు ప్రత్యర్ధులు ఉంటారు కదా…!!
* ఈ ప్రత్యర్ధులు ఊరుకోలేదు. ఓ సామంత రాజుకి ఓ నారితో మాంచి సంబంధాలు ఉన్నాయని, మేయరు పీఠం హామీ ఇచ్చి అన్నీ లాగేసుకున్నారని ప్రచారం మొదలు పెట్టారు. ఇది మరో సామంత రాజుకి (తన కుమార్తెకు మేయరు పీఠం ఇవ్వాలి అనుకుంటున్న రాజుకి) తెలిసిందని ఈ వ్యవహారం రాజుగారి కుటుంబంలోనూ పెద్ద వివాదంగా మారిందని ఓ ప్రత్యర్ధులు ప్రచారం మొదలు పెట్టారు. దీనిలో ఎంత మాత్రం నమ్మదగిన అంశాలు లేవు. కానీ…!! హామీ ఇచ్చిన మాట మాత్రమే వాస్తవం.
సామంత రాజు సుట్టూ సీకటి…!!
ఇక్కడ మరో సామంత రాజు గురించి చెప్పుకోవాలి. ఆయనకు పాలనపై పెద్దగా పట్టు లేదు. మాటకారి తనం లేదు. పెద్దగా పెత్తనం చేయడం చేత కాదు. కానీ మహారాజు గారి చలవతో సామంతుడయ్యారు. అయితే సామంత రాజు తన కుర్చీ ఎక్కినప్పటికీ తనలోని సీకటి వ్యవహారాలూ వదులుకోలేదు. పైకాలు, భూములు, నారీమణులు… ఇలా దేనిలోనూ వదలకుండా తోచినంత చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. ఇవి కొన్ని బయటకు వస్తుండడంతో ఆయనపై సీకటి కమ్ముకుంది. ప్రతిష్ట మసకబారింది. అందుకే రాజ్యంలోని అధికారులు కూడా ఈ సామంతుడి మాటను లెక్కచేయక నేరుగా పక్క రాజ్యంలోని రాజు మాట వింటున్నారు. ఇవన్నీ జరుగుతుండగానే ఈ రాజుగారి పుట్టినరోజు వేడుకల్లో మళ్ళీ “మేయరు” మాట చర్చకు వచ్చి ఇద్దరు సామంత రాజుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఆయుధాలేమి చేతితో పెట్టుకోకుండా… నోటిని ఆయుధంగా మార్చుకుని కాసేపు యుద్ధం చేసుకున్నారు. అనంతరం విషయం మహారాజుకి చేరి ఇద్దరికీ “హెచ్చరిక”లు జారీ చేసి ప్రాధాన్యతలు తగ్గించారు.
(సింపుల్ గా ముగింపు ఇచ్చుకోవాలంటే…. అది ఒక మంత్రికి సొంత జిల్లా. మరో పార్టీలో కీలక ఎంపీకి కీలక జిల్లా అది. సీఎం కి అది అత్యంత ప్రాధాన్యత జిల్లా కావడంతో అక్కడ కొన్ని అంతర్గత వ్యవహారాలు నడపాల్సి ఉంది. పాలన పరమైన అంతర్గత వ్యవహారాలు మంత్రికి, ఇతర.., రాజకీయ పరమైన అంతర్గత వ్యవహారాలు ఎంపీకి అప్పగించారు. కానీ ఒకరి వ్యవహారాల్లో ఒకరు వేలు పెట్టుకుంటూ… ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ… నగర మేయరు పీఠం కోసం పాకులాడుకుంటూ… పైకం మార్చుకుంటూ.., కక్కుర్తి పనులు చేస్తూ.., చీకటి వ్యవహారాలూ నడిపిస్తూ శ్రేణులకు చేదయ్యారు. సీఎం కి కోపం తెప్పించారు. అందుకే అక్కడ ఇప్పుడు ఈ ఇద్దరి హవా తగ్గింది. సీఎం దగ్గరే ఉండే ఓ కీలక అధికారి పరిశీలనలో అక్కడ అడుగులు పడుతున్నాయి. ఇదండీ కథ, అర్ధమయ్యే ఉంటుంది కదా..!! ఎక్కడ? ఎవరు..? ఏమిటి..?? అనేది..!!