రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ కి ఆశలేమీ లేనట్లే కనిపిస్తోంది!శనివారం ప్రకటించిన బిజెపి జాతీయ కమిటీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లకి చెందిన నలుగురికి మాత్రమే స్థానం కల్పించటం ఇందుకు నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంతవరకు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి, సత్యకుమార్ లకు పదవులు లభించాయి దగ్గుబాటి పురందేరేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మరో నాయకుడు సత్య కుమార్ జాతీయ కార్యదర్శి పదవి పొందారు.తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు.మరో తెలంగాణ సీనియర్ బిజెపి నేత డాక్టర్ కె లక్ష్మణ్ పార్టీ అనుబంధ విభాగమైన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పదవి పొందారు.దాదాపు ముప్పై ఆరు మంది కార్యవర్గం ఉన్న బిజెపి జాతీయ కమిటీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు లభించిన ప్రాతినిధ్యం ఇంతే.ఉత్తరాది రాష్ట్రాలవారికి ,బిజెపి అధికారం లో ఉన్న మరికొన్ని ప్రాంతాల నేతలకు కమిటీ కూర్పులో ప్రాధాన్యం ఇచ్చారు.
కాగా పురంధేశ్వరికి ఈ పదవి రావడం పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.ఎన్టీఆర్ కుమార్తె అయిన పురందరేశ్వరి గత ఆరు సంవత్సరాలుగా బిజెపి కాడె మోస్తున్నారు.ఓడిపోతానని తెలిసి మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఆమె బీజేపీ పక్షాన పోటీ చేసి పరాజయం మూటకట్టుకున్నారు.ఆంధ్రప్రదేశ్ నుంచి పరుగు సంపాదించుకున్న మరో నాయకుడు సత్యకుమార్ గురించి తెలిసింది తక్కువే.నెల మొన్నటి వరకు ఏపి బిజెపి చీఫ్గా ఉండి పదవి కోల్పోయిన కన్నా లక్ష్మినారాయణకు కేంద్ర కమిటీలో స్థానం లభిస్తుందని అందరూ భావించారు.అయితే అది కూడా జరగలేదు.కన్నా కిది షాక్ యేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇక తెలంగాణలో పార్టీ పదవులు పొందిన వారిలో డీకే అరుణ కాంగ్రెస్ మాజీ మంత్రి.మొన్నటి లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆమె బిజెపిలో చేరారు.అయినా ఆమెకు జాతీయ పదవి లభించటం విశేషం. తెలంగాణ నుండి పదవి పొందిన మరో నాయకుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాత్రం బిజెపి సీనియర్ నేత .ఏదైనప్పటికీ బిజెపి జాతీయ కమిటీలో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం అతి స్వల్పంగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు!