సాయి పల్లవి.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన `ఫిదా` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ తమిళ సోయగం.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
అయితే ఏమైందో ఏమో కానీ గత కొద్ది రోజుల నుంచి ఈ అమ్మడు సినిమాల పరంగా జోరు తగ్గించేసింది. గత ఏడాది `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగరాయ్` వంటి బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి.. ఈ ఏడాది `విరాటపర్వం`, `గార్గి` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ఇక వీటి తర్వాత సాయి పల్లవి నుంచి కొత్త ప్రాజెక్టుల అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా సాయి పల్లవి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అందుకు కారణం లేకపోలేదు. ఈ బ్యూటీని రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వరించాయి. `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగరాయ్` చిత్రాల్లో నటనకు గాను ఈ అవార్డులను ఆమె దక్కించుకుంది.
ఈ నేపథ్యంలోనే తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. `లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకోవడం ఆనందంగా ఉంది. ఒకేసారి రెండు అవార్డ్స్ అందుకునే ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. ఇందుకు కారణమైన శేఖర్ కమ్ముల, రాహుల్ సంక్రిత్యన్ లకు, చిత్ర నిర్మాతలకు, యూనిట్ సభ్యులకు నా కృతఙ్ఞతలు..` అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టిన సాయి పల్లవి.. తన అవార్డ్స్ తో దిగిన ఓ పిక్ను సైతం షేర్ చేసింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆమెను విషెస్ తెలుపుతున్నారు.
https://www.instagram.com/p/CjlADm4pRsv/?utm_source=ig_web_copy_link