ఎన్నితిట్టినా మౌనమే సమాధానం
కాంగ్రెస్ యువనాయకుడు సచిన్ పైలట్, ప్రత్యర్థులకు ఒక్కటే చెబుతూ వచ్చారు. నేను ఎప్పటికీ బీజేపీలో చేరను. అది ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందని రాహుల్ గాంధీతో భేటీ తర్వాత స్పష్టం చేశారు. నెల రోజులుగా చావుబతుకుల మధ్య కొట్టాడుతున్న గెహ్లాట్ సర్కారును పైలట్ కాపాడారు. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ తర్వాత సచిన్ హస్తం పార్టీకి ఆ భరోసా ఇచ్చారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనను వ్యక్తిగతంగా ఎంత కార్నర్ చేసినా… ఎన్ని దుర్భాషలాడినా పైలట్ మాత్రం ఒక్క మాట కూడా జారలేదు.
బీజేపీకి దూరంగానే ఉన్న పైలట్
సచిన్ పైలట్ ఓ పనికిమాలిన వ్యక్తి అని… మీడియాలో తనను హైలెట్ చేసుకోడానికి, యాంకర్లను ఆకట్టుకోడానికి అద్భుతమైన ఇంగ్లిష్ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తారంటూ కూడా ఎదురుదాడి చేశాడు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. పైపెచ్చు రాజస్థాన్ పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవుల్లోంచి తొలగించినా మౌనమే సమాధానమంటూ నిజమే నిలుస్తుందంటూ ట్వీట్ చేశారు తప్పించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గెహ్లాట్ రాజస్థాన్ను పాలిస్తున్న తీరుపై మొదట్నుంచి పైలట్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాడు. పార్టీలో తిరుగుబావుటా ప్రకటించాక… బీజేపీకి అదే దూరం మెయింటేన్ చేయడం కూడా పెద్ద విషయమే.
పదవి ఊడుతుందోనన్న బెంగలో గెహ్లాట్
మొత్తంగా పైలట్తో సఖ్యత వ్యవహారంతో గెహ్లాట్ తీవ్రంగా కలత చెందుతున్నాడు. ఎందుకంటే తన పదవికి ఎప్పుడు ముప్పు వస్తుందోనన్న బెంగ ఆయనను వెంటాడుతోంది. మొత్తం వ్యవహారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రికి మద్దతిస్తున్న సోనియా టీం సభ్యుడు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశాడు. ప్రస్తుతం రాజస్థాన్ సర్కార్ నిలవాలంటే పైలట్తో సఖ్యత అవసరమని కుండబద్ధలు కొట్టాడు. సోనియా, రాహుల్, ప్రియాంక అందరూ కూడా పైలెట్కు బాసటగా నిలుస్తున్నారన్న విషయం మరచిపోతే కొంప కొల్లేరవుతుందంటూ గెహ్లాట్కు సదరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ హితోపదేశం చేయడంతో అవాక్కయ్యాడు గెహ్లాట్. ఢిల్లీ నుంచి వస్తున్న సందేశాలతో గెహ్లాట్లో కలవరం మొదలయ్యింది. ఎప్పుడు తన చాప కిందకు నీళ్లొస్తాయన్న వర్రీ ఆయనలో మొదలయ్యింది.
మరో పరాభవం వద్దనే జాగ్రత్త
మధ్యప్రదేశ్లో పార్టీకి కీలక నాయకుడిగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా తర్వాత… సచిన్ పైలెట్ని కోల్పోవడం ఎంత మాత్రం కరెక్టు కాదన్న నిర్ణయానికి పార్టీ వచ్చిందని తెలుస్తోంది. జ్యోతిరాధిత్య సింధియాతో రచ్చతో మధ్యప్రదేశ్ సర్కారును కోల్పోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని పార్టీ నేతలు చెబుతున్నారు. సింధియాకు ఏడాది అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం… ఆయనను పార్టీలోంచి వెళ్లేలా చేసిన పరిస్థితులతో కాంగ్రెస్ జాగ్రత్త పడింది. సింధియా 2 పరాభవం కాంగ్రెస్కు పైలెట్ విషయంలో జరగరాదన్నది సోనియా, రాహుల్ ఉద్దేశంగా తెలుస్తోంది. పైలట్ బయటకు వెళ్లిపోతే మరో పెద్ద రాష్ట్రాన్ని బీజేపీకి పళ్లెంలో పెట్టి ఇచ్చినట్టవుతుందన్న బెంగ కాంగ్రెస్లో ఉంది.
రాజస్థాన్లో ప్రాంతీయ పార్టీలు వర్కౌట్ కావు
అదే సమయంలో పైలట్ తనకు మద్దతుగా నిలుస్తున్న 18 మంది ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అదే సమయంలో వారందరూ కూడా బీజేపీలో చేరందుకు సిద్ధంగా లేకపోవడం కూడా పైలెట్ వ్యూహాలను మార్చేలా చేసిందని చెప్పొచ్చు. అదే సమయంలో రాజస్థాన్లో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అంత వీజీ కాదన్న నిర్ణయానికి కూడా పైలెట్ వచ్చారు. ఇందుకంటే రాజస్థాన్ లో బీజేపీ లేదంటే కాంగ్రెస్ పార్టీలు మాత్రమే మనుగడ సాగించగలవు. ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి ఓడి… మరోసారి గెలవడం ఆనవాయితీగా వస్తోంది. అదే సమయంలో హర్యానా హోటల్ ఉన్న రెబల్ ఎమ్మెల్యేలందరూ కూడా రిసార్ట్ రాజకీయాలతో విసిగిపోయారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
గెహ్లాట్ను తొలగించాలన్న ఏకైక డిమాండ్
పైలట్ మొదట్నుంచి కోరుకుంటుంది ఒకటే తనను దేశ ద్రోహి అన్న గెహ్లాట్ ను తొలగించాల్సిందే. తన డిమాండ్లను పరిష్కరించేందుకు గాంధీ కుటుంబం నుంచి సానుకూలత వ్యక్తమవడంతోపాటు… రెబల్ ఎమ్మెల్యేల డిమాండ్లను పరిష్కరిస్తామన్న హామీతో పైలట్ రాజీ ఫార్ములాకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. మాతృభూమికి సేవచేయడం కంటే మిన్న అయిన ఘనకార్యం ఏముందంటంటారు పైలట్. గెహ్లాట్ ఇప్పుడు పైలట్ ను రాజస్థాన్ డిప్యుటీగా తిరిగి నియమించడం… ఆయన అనుయాయులకు కీలక పదవులు అప్పగించడం చేయాల్సి ఉంటుంది.
వచ్చే ఎన్నికల తర్వాత సీఎం క్యాండిడేట్
వచ్చే ఎన్నికల వరకు గెహ్లాట్ తో సయోధ్య గడిపితే… వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పైలట్ ను ప్రకటిస్తామన్న భరోసా కాంగ్రెస్ నుంచి వచ్చింది. అంటే మొత్తంగా పైలట్ తీసుకున్న నిర్ణయం కూడా శభాష్ అనే రీతిలో ఉంది. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీకి ఆయన మద్దతిచ్చినా… వసుంధరా ముఖ్యమంత్రి అవుతారు కానీ తాను కాబోడు. తాను మరో సింధియా కావడం పైలట్ కు ఇష్టం లేదన్నది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత వరకు వచ్చాక గెహ్లాట్, పైలట్ కలసి పనిచేస్తారా అన్న అనుమానాలు రెకెత్తుతున్నాయ్. అయినప్పటికీ మిస్టర్ క్లీన్ అన్న పేరు సంపాదించుకున్న పైలట్… ఇప్పుడు తనో ఫిరాయింపుదారు అన్న ట్యాగ్ లైన్ మంచిది కాదన్న అభిప్రాయంలో ఉన్నారు.
ఫలించిన రాహుల్, ప్రియాంక దౌత్యం
మొత్తంగా రాహుల్, ప్రియాంక ఇప్పుడు తన సోదరుడు పైలట్ విషయంలో విజయం సాధించారని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్పుడూ మనం చెప్పేమాట… అవతల వారి బలహీనతే వారి బలమని… కానీ ఇప్పుడు ఆ పంథా మార్చుకొని ముందడుగేస్తోందనుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి ఇగోతోనే వదులుకున్న కాంగ్రెస్… 42 ఎంపీ స్థానాలను రెండు రాష్ట్రాల్లో చతికిలపడిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని కోల్పోయింది. ఇప్పుడు రాజస్థాన్ కోల్పోవడం కంటే… వ్యతిరేక అభిప్రాయాన్ని గౌరవించాలన్న నిర్ణయానికి వచ్చింది. మొత్తంగా మరక మంచిదే… కాంగ్రెస్ పార్టీ కొత్త లైన్ ఆ పార్టీకి భవిష్యత్లో కచ్చితంగా ఉపయోగపడుతుంది.