బోడి గుండు కంటే బట్టతల నయం అనే విషయం ఓ జాతీయ పార్టీ బాగా ఎరిగినట్టుంది. ఆ బట్టతలపై కూడా విగ్ పెట్టేసుకుని…, మేకప్ వేసుకుని… ముఖం కవర్ చేసుకుని రాజకీయం మొదలెట్టే పనిలో ఉంది. ఆ పార్టీలో అత్యంత కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. కొన్నిమైనస్ లు… మరికొన్ని ప్లస్ లు జరగనున్నాయి. వెరసి ఆ జాతీయ పార్టీ 2023 నాటికి రాష్ట్రంలో రెండో స్థానంలోకి చేరుకోవాలనేది ప్రణాళిక…!!
ఓట్లు లేకపోతేనేం… సీట్లు లేకపోతేనేం… కేంద్రంలో అధికారం ఉంది. వ్యవస్థలు చేతిలో ఉన్నాయి. చీకట్లో మాట్లాడుకుని అమలు చేసే ప్రభుత్వం ఉంది. చెప్పిందల్లా చేసే పక్క పార్టీ ఉంది. ఇవి చాలు ఏపీలో బీజేపీ బలపడడానికి (అని వారు అనుకుంటున్నారు..!) కానీ వారికి తెలియంది, వారు గుర్తించనిది.., వారు ఏ మాత్రంఅంగీకరించనిది ఒకటుంది. అది అయిదేళ్లకోసారి ఎలక్ట్రానిక్ మిషన్ల ద్వారా వారికి కనువిప్పు కలిగిస్తుంది.. అయినా షరా మామూలే…!! ఇక విషయంలోకి వెళ్తే ఏపీ బీజేపీ బలోపేతానికి కసరత్తులు చేస్తుంది. అందుకు కొన్ని తీసివేతలు, కూడికలు కూడా ఉంటాయని సంకేతాలు ఇస్తుంది.
విశాఖకు చెందిన కీలక నేత సహా మాజీ మంత్రిపై వేటు…?
మనం (న్యూస్ ఆర్బిట్ లో) ముందు నుండి చెప్తున్నట్టు కమ్మ బీజేపీ, కాపు బీజేపీ… అసలు బీజేపీ.. అనేవి ఉంటాయని అనుకున్నాం (గుర్తులేకపోతే ఆ కథనం ఒక్కసారి తిరగేయండి)… ఇప్పుడు కమ్మ బీజేపీలో కొందరిని తరిమేసే పనిలో బీజేపీ ఉంది. అందులో భాగంగా విశాఖకు చెందిన ఓ కీలక నేత (గతంలో ఎంపీగానూ, పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు)ను త్వరలోనే పార్టీ నుండి సస్పెండ్ చేయనున్నారని సమాచారం.
ఏపీ బీజేపీలో ఈయన సహా మాజీ మంత్రి (గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. ఇటీవల ఓ హోటల్ సిసి టివి ఫుటేజ్ తో మళ్ళీ వెలుగులోకి వచ్చారు) ఒకరు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వారితో పాటూ మరో ఇద్దరు నేతలను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కేంద్ర పెద్దలు అమిత్ షా.., మోదీలకు రాష్ట్రంలోని సోము వీర్రాజు బృందం ఓ నివేదిక ఇచ్చిందట. దాని ప్రకారం పరిశీలిస్తే…!!
టీడీపీతో సఖ్యతతో ఉంటె ఇక అంతే…!!
సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాక ముందు నుండీ కొంత తెరవెనుక కసరత్తులు చేసారు. ఓ జాబితాను తయారు చేసి… జీవిల్.., సునీల్ దేవధర్ ద్వారా కేంద్ర పెద్దలకు చేరవేశారు. వీటిని పరిశీలించిన కేంద్ర పెద్దలు నిజమేనని ధృవీకరించుకుని ఇద్దరిపై వేటు వేసేందుకు అనుమతులు ఇచ్చారని బీజేపీలో అంతర్గత చర్చ జరుగుతుంది. నిజానికి ఈ ఇద్దరికీ కేంద్రంలో, జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న ఒక నాయకుడి ఆశీస్సులు ఉన్నాయి… కానీ ఈ ఇద్దరూ టీడీపీతో సఖ్యతగా ఉంటున్నారని ఆధారాలతో సహా పెద్దలకు వెళ్లడంతో ఈ ఇద్దర్ని బయటకు వెళ్లగొడితే ఇక పార్టీలో చాలా మంది దారిలోకి వేస్తారని సోము వర్గం భావిస్తుంది.
రెండేళ్లలో జగన్ పని కూడా…!!
ప్రస్తుతం బీజేపీ టార్గెట్ మొత్తం టీడీపీ. ఆ పార్టీ నాయకులను అవకాశం ఉన్నంత వరకు చేర్చుకుని… మిగిలిన వారిని వైసిపిలో అయినా చేర్చేలా ప్రోత్సహించి… తర్వాత వైసీపీతో తాడోపేడో తేల్చుకోవాలనేది వ్యూహం. టీడీపీని దెబ్బ కొట్టే క్రమంలో కొన్ని కోవర్టులు అడ్డు వస్తున్నాయని భావించిన బీజేపీ పెద్దలు ముందు వారిని వేటు వేయనున్నారు. రెండేళ్లలో టీడీపీ కి ఊహించని దెబ్బలు వేసి.., తర్వాత జగన్ పని పట్టాలని అనుకుంటున్నారట. పనిలో పనిగా ఆ తర్వాతనే పవన్ సినిమాల నుండి మళ్ళీ రాజకీయాల్లోకి రావడం, పవన్ అన్నయ్య చిరు మళ్ళీ యాక్టీవ్ పాలిటిక్స్ లోకి వచ్చి బీజేపీలో చేరి తమ తరపున ప్రచారం చేయడం… ఇలా అనేక వ్యూహాలు, కలలు ఉన్నాయి. ఎంత వరకు ఫలిస్తాయనేది పక్కన పెడితే… ఒకర్ని నాశనం చేయడం సులువు.., కానీ తాము బలపడడం కష్టం. అందుకే ఇక్కడ బీజేపీ బలపడిన పాడకపోయినా.., టీడీపీని మాత్రం బలహీనపర్చడం వారికి సులువు…!!