చైనా గూఢచార నౌక ‘యువాన్ వాంగ్’ శ్రీలంకకు చేరుకుంది. శ్రీలంకలోని హంబర్ టోటా పోర్టుకు ఈ ఉదయం చేరుకున్న చైనా గూఢచార నౌక పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చైనా నౌక ‘యువాన్ వాంగ్ 5’ కి బాలిస్టిక్ క్షిపణులు, అంతరిక్షం, ఉపగ్రహాలపై నిఘా వేయగలిగే అధునిక సాంకేతిక హంగులు ఉండటంతో భారత్ ఆందోళన వ్యక్తం చేస్తొంది. ఈ నౌక ఉదయం 8.40 గంటలకు శ్రీలంక చేరుకుందని హార్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ ఢీ సిల్వా వెల్లడించారు. భారత్ అభ్యంతరాల నేపథ్యంలో అత్యాధునిక ఈ నౌకను తమ దేశానికి తీసుకువచ్చే ఆలోచన వాయిదా వేసుకోవాలని ఇంతకు ముందే చైనాను శ్రీలంక కోరింది. అయితే హఠాత్తుగా నిర్ణయాన్ని మార్చుకుని చైనా నిఘా నౌక ‘యువాన్ వాంగ్’ కు అనుమతిస్తూ శ్రీలంక ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.
అయితే తమ సముద్ర జలాల్లో ఎలాంటి శాస్త్రీయ పరిశోధనలు జరపడానికి వీల్లేదన్న షరతులతో ఈ నౌకకు శ్రీలంక అనుమతించిందని పోర్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇంధనం, సరుకులు నింపుకోవడానికే పంపుతున్నట్లు చైనా చెబుతోంది. చైనా గూఢచార నౌక పొరుగున్న ఉన్న శ్రీలంక చేరుకోవడంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తొంది. ఇండియన్ ఇన్స్టాలేషన్ ను ట్రాక్ చేసే అవకాశం ఉందని భారత్ అనుమానిస్తొంది. మరో పక్క చైనా నౌక వచ్చిన నేపథ్యంలో శ్రీలంక విదేశాంగ శాఖ స్పందించింది. భారత్ రక్షణ తమకు అత్యంత ప్రధానమైనదని ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ కోరుకున్న విధంగానే యువాన్ వాంగ్ ను హాండిల్ చేస్తామని తెలిపింది. ఇరు దేశాల సార్వభౌమత్వాలను కాపాడుతామని తెలిపింది.
ఈ గూఢచార నౌక 750 కిలో మీటర్ల మేర ఉన్న ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. ఫలితంగా కల్పకం, కూడంకుళం సహా అణుపరిశోధన కేంద్రాలు దీని పరిధిలోకి వచ్చేస్తాయి. దీంతో పాటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా నేత్రం ఉంచగలదు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన సంస్థల కీలక సమాచారాన్ని సేకరించగలదు. ఈ నేపథ్యంలోనే భారత్ అనేక అనుమానాలు, అభ్యంతరాలను వ్యక్తం చేస్తొంది. సోమవారం శ్రీలంక చేరుకున్న ఈ నౌక ఈ నెల 22వ తేదీ వరకూ హంబర్ టోటా పోర్టులో నిలిచి ఉంటుంది.
జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం .. ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్