కరోనా టీకా కోసం ప్రజలు అందరూ ఎదురుచూస్తున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దేశంలో తొలి దశ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ఈ నెల 16వ తేదీన ప్రధాన మంత్రి మోడి ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి దశలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి దశ వ్యాక్సిన్ పంపిణీలోనే ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించాలని పలు రాష్ట్రాలకు చెందిన నేతలు కేంద్రాన్ని కోరినా అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోడి ఒకింత కటువుగానే ప్రజాప్రతినిధులు వారి వంతు వచ్చే వరకూ ఆగాలని తేల్చిచెప్పేశారు.
తొలి విడత పంపిణీలో ప్రజా ప్రతినిధులు ఏవరూ వ్యాక్సిన్ కోసం బారులుతీరవద్దని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి ఆ మాట అనకుండా ఉండి ఉంటే ఈ పాటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల వంటి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ కోసం పోటీలు పడి మరీ వేయించుకునే వారు. నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడినే స్వయంగా చెప్పడంతో ప్రజా ప్రతినిధుల జులుం లేకుండా తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగిపోతున్నది. ఇక రెండవ దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఆయన పాటు ముఖ్యమంత్రులు కూడా టీకాను తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 50 ఏళ్లు పైబడిన ప్రజా ప్రజా ప్రతినిధులకు రెండవ దశలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి మోడీ స్వయంగా సీఎంల భేటీలో ప్రస్తావించారు.
సుమారు మూడు కోట్ల మంది దాకా ఉన్న ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ ముగిసిన తరువాత రెండవ దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రెండవ దశ ప్రారంభించిన తొలి రోజే ప్రధాన మంత్రి మోడీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా నిన్నటి వరకూ దేశ వ్యాప్తంగా 7.86 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుధవారం ఒక్క రోజే 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షా 12వేల ఏడు మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ లకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వడంతో ఈ రెండు వ్యాక్సిన్ లను పంపిణీ చేస్తున్నారు. రెండవ విడత పంపిణీ సమయానికి మరో ఒకటి రెండు వ్యాక్సిన్ లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.