Cyclone Tauktae: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను మరో 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 18న మధ్యాహ్నం 2.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల సమయంలో గుజరాత్ లోని పోరు బందర్ – నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. తీరం దాటే సమయంలో గంటలకు 150 – 175 కిలీ మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను కారణంగా ఆదివారం నుండి మంగళవారం వరకూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాను ప్రభావిత రాష్ట్రాలైన కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు కేంద్రం వంద రెస్క్యూ ఏర్పాటు చేసింది. గుజరాత్ లోని సౌరాష్ట్రతో పాటు మహారాష్ట్రలోని పాల్ఘాఢ్, రాయ్ గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు ముప్పు ఎక్కువగా ఉంటుందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది.
నిన్నటి నుండి కురుస్తున్న కుండపోత వర్షాలు, ఈదురు గాలులకు కేరళ అతలాకుతలం అవుతోంది. ఇప్పటి వరకూ ఇద్దరు మృతి చెందారు. పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కేరళలోని తొమ్మిది జిల్లాల్లో రాగల 24 గంటల్లో 204 మి.మీ వర్షపాతం నమోదు అవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రెండు రోజుల్లో 145.5 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు కేరళ సీఎం పినరయ్ విజయన్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాలకు తాక్టే ఎఫెక్ట్
తాక్టే కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుండగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తెలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపిలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రతో పాటు యానాంలో ఇదే పరిస్థితి ఉంటుందని, దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో గాలలు వీస్తాయని పేర్కొంది. తాక్టే తుఫాను ప్రభావంతో కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో శనివారం మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పలు ప్రాంతాల్లో వరి, ఇతర పంటలను నూర్పిళ్లు చేసుకోగా వర్షంతో తడిసిపోయాయి. శనివారం అత్యధికంగా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో 20.5 మిల్లీ మీటర్ల వర్షం పడింది. అదివారం ఉదయం ఏపిలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఖావృత్తమై ఈదురు గాలులు, ఉరుములు మెరుపులుతో కూడిన వర్షం పడుతోంది.